సరళ నీల

మంచి గాయని, విమర్శకురాలు, మిత్రురాలు, మీదు మిక్కిలి చదువరి అయిన సరళ మోహన్ గారు నీల నవలపై నిష్పాక్షిక సమీక్ష చేసారు. వారికి ధన్యవాదాలు.

*****************

ఇరవై రోజుల క్రితం మొదలెట్టి రెండు రోజులలో చదవడం పూర్తిచేసానీ నీలని…547 పేజీల నీలను…ఎందుకంటే ఏకబిగిన చదవకుండా వదలబుద్దికాలేదు..ఆ రెండు రాత్రిళ్ళ నిదరలో కూడా నీల పలకరిస్తూనే ఉంది..నీల వదలలేదు ..ఆ నీల మత్తులో నుంచి బయటపడ్డాకే సమీక్ష రాయాలని ఆపాను..పుస్తకం పూర్తిచేసాకే పుస్తకంలోని చినవీరభద్రుడు గారు..ఎకే ప్రభాకర్ గారు రాసిన ముందు మాటలు ఫేస్ బుక్ సమీక్షలు చదివాను..లేకపోతే ఆ మాటలముద్రలు పడతాయని…

 

నీల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పవలసింది మల్లీశ్వరి గారు ఈ నవలలో 547 పేజీలలో చాలా వరకు ప్రతి వాక్యం ని జాగ్రత్తగా కవితాత్మకంగా అర్ధవంతంగా జీవంతొణికిసలాడే ప్రాణమున్న శిల్పంలా చెక్కిన తీరు గురించి చెప్పాలి ..ఏవాక్యంనీ గబగబా చదివేయలేం..వాక్యంలో అర్ధాన్ని అందాన్ని ఆస్వాదిస్తూ తప్ప…ఇంత పెద్దనవలలో బంద్ లు ఉద్యమాలగురించి వివరణలలో పది పదిహేను పేజీలు మాత్రమే పైపైన చదివి తిప్పేసాను అంటే ఏరకంగా ఈ నవలని అల్లారో చూడండి

 

నీల బాల్యదశ యవ్వన దశ మధ్య వయసు వరకు నీలజీవిత వివరణ నీల …కానీ వీటన్నిటిలో నీల బాల్యంలోనే నాకు మరీ నచ్చుతుంది…యుక్తవయసు లో నీలకూతురు మినో ఆలోచించే పద్దతి కన్నా నీల ఆ వయసులో ఆలోచించిన పద్దతే నాకు నచ్చింది ..చిన్నపుడే అవసరమైతే పెద్దవారినే ప్రశ్నించగల సత్తా ఉన్న అమ్మాయ్.తాగినందుకు నాన్నని కొడుతుంటే చాలామంది తాగుతున్నారు కదా! నాన్ననే కొడుతున్నారెందుకు? అని అడగగలదు

 

ఈ నవల లో పెళ్ళి చేసుకున్న1 నీల..2 నీల అమ్మచంద్రకళ .. 3నీలను విడాకులతరువాత ఆదుకున్న సంపూర్ణ.. 4 సదాశివ తల్లి.నీతాబాయ్ …నలుగురు వివాహంతో పూర్తి సంతృప్తిగా ఆనందంగా బతకలేకపోయారు….

 

1 నీల విడాకులకు కారణం భర్త వివాహేతర సంబంధం…వివాహం కాకముందునుంచీ సరళతో ఉన్న శారీరక మానసికసంబంధం.పెళ్ళై భర్త పోయి ఇద్దరు పిల్లలున్న సరళ ని ఎందుకు చేసుకోవాలి..తన ఆస్తినెందుకివ్వాలనుకుని ..పల్లెటూరి పిల్ల …బాగుంది..తనేం చేసినా సర్దుకుపోతుందని కావాలని ఇష్టపడి నీలకు సరళసంగతి చెప్పకుండా దాచి పెళ్ళిచేసుకున్న ప్రసాద్ .జాలి సానుభూతి నీలమీద ఉన్న ప్రసాద్..తమ అక్రమ సంబంధం బయటపడగానే పచ్చిబాలింతరాలని కూడా చూడకుండా మానసికంగా హింసించడం జాలి కూడా లేకుండా తనని కొట్టడం తరువాత ఏడవడం చేసే ప్రసాద్ పాపపుట్టాక నీలని కూడా అనుమానించడం..సంబంధం అంటగట్టి మాటాడటం.తరువాత కొట్టడం..ఏడవడం..

 

సరళని కూడా తనలానే హింసించడం చేస్తున్నాడని తెలిసాక ఆ బంధం నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది..తను బయటకు వస్తే వారిద్దరన్నా బాగుంటారనుకుని…

 

2 నీల తల్లి చంద్రకళ భర్త తాగుడు…కుటుంబ బాధ్యత తీసుకోకపోవడం…తో వివాహేతరసంబంధం కి వెళుతుంది..

 

3 సంపూర్ణ కు మానసికంగా అమాయకుడైన భర్త…పిల్లలు .తనకి ఆకర్షణ హోదాగల గొప్పజీవితం మీద..దానికోసం తనకు అందుబాటులో ఉన్న వనరులు వాడుకోడం తప్పు కాదనుకుంటుంది..నాగరికంగా అందంగా ఉన్న డ్వైక్రా గ్పూపు అతను చంద్రకాంత్ సహాయంతో అతని ఎడల ఆకర్షణా ఉంటుంది..సంఘంలో అతని సాయంతో ఎదుగుతుంది .

 

4 సదాశివ తల్లిదండ్రులు నీతాబాయ్ ప్రకాష్ ఒకరినొకరు ప్రేమించి నీలాబాయ్ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకుని కూడా నీతాబాయ్ భర్త దగ్గరఆర్ధిక అసమానతలు…పెరిగిన వాతావరణం అత్తింట లేక ఎడ్జస్ట్ అవలేక పుట్టింటికి వెళ్ళిపోయి తన భర్తనే పుట్టింటికి పిలుచుకుంటుంది…అతనికది తీరని కోత..

 

నీల జీవితం సదాశివ తో కలిసి చేసే సహజీవనం చాలాబాగున్నట్లు చూపారు…సదాశివ తన భార్య కిష్టమైతే ఎలాటి మొహమాటాలు లేకుండా నీల అంతకుముందు ప్రేమించిన పరదేశితో శారీరకంగా గడుపు అని చెప్పేటంత మంచివాడే…మరి మానసికంగా ఆందోళనెందుకు పడతాడో?నీలతిరిగొచ్చేదాకా! ..అలాగే సదాశివ ప్రతిసంవత్సరం వసుంధరతో రెండురోజులు గడుపుతానంటే నీలకెంత అభద్రతో చదివాక సహజీవనాలలో కలిసిజీవించే ఆదర్శవాదులకు !కూడా బోలెడన్ని దిగుళ్ళు బెంగలు.. ఎన్నిఅభద్రతలు వేటాడుతాయో పక్కాగా తెలుస్తుంది..

 

పెళ్ళి సహజీవనాలలో భద్రత కొద్దోగొప్పో ఉండేది పెళ్ళిలోనే…కనీసం మగవాడు కొన్నిటికన్నా జవాబుదారిగా నన్నాఉంటాడు..పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఎంత శాతం విఫలమో ప్రేమ పెళ్ళిళ్లూ అంతే…సహజీవనాలు అన్ని నీలలాగా ఎట్టిపరిస్ధితులలోనూ ఉండవు…అసలు ఆర్ధికఅసమానతలు లేని..ఆర్ధికస్వాతంత్ర్యం ఉన్నవారికే అంటే ఐతే దిగువ ఆర్ధికతరగతి లేదా ఎగువ ఆర్ధిక తరగతి..సమాన ఆర్ధిక తరగతులు ..స్వయం ప్రతిపత్తి ఉంటే సహజీవనాలు పనికివస్తాయే తప్ప డిపెండ్ అయే స్ధితి ఉండి సహజీవనాలలోకి వెళ్తే పరిస్ధితులేంటో నీలలో అసలెక్కడా చర్చింపబడలేదు. పైగా సహజీవనాలంటే బలేగుంటాయన్నంత బాగా వర్ణించారు….అంత ఈజీ గా నీలకెదురైనంత మంచి వ్యక్తులు సామాజిక భద్రత ఆర్ధిక ఉన్నతి ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి తో ఉండగలిగే పరిస్ధితులూ నూటికో కోటికో ఒక్కరికి దక్కుతాయ్…నీలలాటి పరిస్ధితి ఉన్నవారికి ..

 

అసలా మాటకొస్తే నీలకు తారసపడినవారంతా ఏదో ఒకరకంగా మంచివారే….ప్రసాద్ కూడా సరోజతో తన వివాహేతరసంబంధం యాక్సెప్ట్ చేసి నీల నిర్వికారంగా తనకి వళ్ళప్పచెప్తే బాగానే ఉండేవాడే..సరోజ మంచిదే…కానీ నీల యంత్రం కాదు…సూర్యం..ఆరంజ్యోతి…పోరాటమెలా చేయాలో చూపినా తమ్ముడు సూర్యంకోసం మైండ్ పోగొట్టుకున్న ఆరంజ్యోతి నీలలో అభద్రత ని నింపింది…

 

చిన్నపుడే ప్రశ్నించే నీల పెద్దైపోయేకొద్దీ .చాలాచోట్ల పోరాటమే మరచిపోయింది ..తన తల్లి దండ్రుల జీవితం చూసి తల్లి వివాహేతరసంబంధం మూలాన తను అనాధలా బతకవలసిన పరిస్ధితులలో తనజీవితం ఉన్నంతలో ఎలాగోలా సర్దుకుపోడానికి ప్రయత్నించే క్రమంలో ఫాదర్ దగ్గర గడిపేలా బాల్యం తననుతను మలచుకుంటుంది ..వివాహానికి కట్టుపడాలని గట్టిగా అనుకుని సర్దుకుని గడిపేయాలనే చూసింది ..ప్రసాద్ తో…వల్లకాని పరిస్ధితులలో బయటకు వచ్చేస్తుంది…సంపూర్ణ లాటి అండ దొరకడం కూడా అందరికీ కష్టమే…పరదేశి మంచివాడు..కానీ చేతనతో ఐదేళ్ళ లైవ్ రిలేషన్ షిప్ ఉందని తెలుసుకుని నేను నీతో కంటిన్యూ అవలేనని చెప్తుందే కానీ అంత ప్రేమించింది మరల ఎపుడూ మిత్తరికం నిలుపుకోవాలనే చూసినట్లనిపించదు…నీతాబాయ్ మంచిది..అజిత మంచిది..సదాశివ మంచివాడు…పైడమ్మ మంచిది….ఇలా అందరు మంచివారే …కానీ మనుషులు…కనక బలహీనతలూ ఉన్నవారిగా చూపిస్తారు..
మినో మాటలు నవల చివరిలో ఆమె ఆలోచనా ధోరణి సదాశివతో మాటలాడే పధ్దతి…ధిక్కారం…ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండబోతుందో తేటతెల్లం చేసింది….

 

ఏదైనా నవలని కొన్నిచోట్ల ఇంకొంత కుదించినా బాగుండేదనిపించింది…శైలి ఆపకుండా చదివించినా సరే! పరదేశి పాత్ర ఐపోయేదాకా స్పీడ్ గా ఇంటరెస్టింగ్ గా చదువుతాం…తరువాత కధనం లో అంతకుముందు భాగంలో ఉన్న బిగీ పట్టు తగ్గింది…నీతాబాయ్ ప్రకాష్ ల ప్రేమకధ మరీ అంత వివరణ అవసరం లేదేమో ననిపించింది…పైడమ్మ పాత్ర నాకు చాలా నచ్చిన పాత్ర…అజిత పాత్ర అత్యాధునికంగా ఆలోచించే పాత్ర ..

 

కొన్నిఅవసరమైన చోట్ల మరీ క్లుప్తంగా ముగించారు అని నాకనిపించింది…..పరదేశి రీ ఎంట్రీ..నవలలో మరింత వివరిస్తే బాగుండేది…

 

సరళ మోహన్

విలువల్లో కలకలం రేపిన నీల

నవల చదవగానే తను మాట్లాడాలనుకున్నది ప్రశ్నల రూపంలో పంపి ఇంటర్వ్యూ చేసిన మౌళికి, స్పేస్ సమస్యలూ కత్తిరింపులూ లేకుండా ప్రచురించిన మనం టీమ్ కీ ధన్యవాదాలు.
*********
విలువల్లో కలకలం రేపిన ‘నీల’
డాక్టర్ కె.ఎన్. మల్లీశ్వరి పుట్టింది ఏలూరు దగ్గర పల్లెటూరు. నివాసం విశాఖపట్నం. గత పాతికేళ్లుగా విశాఖపట్నంతో వున్న అనుబంధం ఆమెలో సృజనశీలిని విస్తీర్ణం చేసిందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర నాడిని పట్టుకున్న సృజనశీలి.కథకురాలుగా ఎంత ప్రసిద్ధమో జాజిమల్లి బ్లాగ్ కథలతో బ్లాగర్‌గా అంతే సుపరిచితం. వివిధ ప్రక్రియల్లో పదిహేను పుస్తకాలు ప్రచురించారు. ‘సోషలిస్ట్ ఫెమినిస్ట్‌ని నేను – నా ఆచరణ రంగం అదే’ అని చెప్తారామె. ప్ర.ర.వే జాతీయ కార్యదర్శిగా క్రియాశీలక పాత్రని నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల పరిశ్రమ తర్వాత వచ్చిన ‘నీల’ ఆమె ఇటీవలి సృజన. ఆ నవల్లో విప్లవోద్యమ సృ్పహని అందించారు. ఒక విశాలమైన జీవితాన్నే కాదు, ఆ జీవితంతో ముడిపడిన అనేక విస్తృత జీవిత శకలాలను పరిచయం చేసిన గొప్ప నవల. తానా బహుమతి పొందిన నవల. ఈ నేపథ్యంలో మల్లీశ్వరితో ముఖాముఖి…

**********

‘నీల’ నవల రాయటానికి తొలి ప్రేరణ ఏమిటి ? ‘నీల’ నవల రాయడం వెనుక జరిగిన అంతర్మథనం ఏమిటి?

తొలి ప్రేరణ అనేది ఫలానా ఘటన ద్వారా జరిగింది అని చెప్పలేను. కథలూ విమర్శ ద్వారా నేను మాట్లాడు తున్నవి నాకు అసంపూర్ణంగా ఎపుడు అనిపించాయో కూడా చెప్పలేను. కానీ లోకం నుంచి నేను గ్రహిస్తున్నదాన్ని మళ్ళీ లోకంతోనే పంచుకోవడానికి నాకు విస్తృతమైన కాన్వాస్ కావాలనిపించింది. స్త్రీల జీవితాల్లో ఈ మూడు దశాబ్దాలుగా చాలా మార్పులు వచ్చాయి. అందులో కొన్ని మార్పులకి నే నూ లోనయ్యాను. ఈ మథనం బహుశా పదేళ్ళ కిందట మొ దలై ఉండొచ్చు. నన్నూ నా చుట్టూ ఆడవాళ్ళని మరింతగా ప్రేమించడం నాకొక అవసరంగా మారింది.

‘నీల’ నవల రాస్తూ వున్నప్పుడు మీ ముందు మీరెదుర్కొన్న ప్రశ్నలు, మీలో కలిగిన ప్రకంపనలు ఏమిటి?

వాస్తవభ్రాంతిని కలిగించే కల్పన చేయడం అంటే అస లు ముందు వాస్తవం గ్రహించగలగాలి. ఒకోసారి వాస్తవమే కల్పన కన్నా చిత్రంగా ఉంటుంది. నమ్మగలగాలి. సత్యాన్వే షణలో అప్పటివరకూ నమ్మిన విలువలు, విషయాలు దూదిి పంజెల్లా తేలిపోతాయి, తట్టుకోవాలి, పాత్రల కల్పనలో ప్రతి పాత్ర వద్దా రోజుల తరబడి నిల్చుని, ‘ఇక్కడ నువ్వు ప్రవే శించావా?’ అన్న ప్రశ్నని తరుచుగా ఎదుర్కొన్నాను. నేను, నన్ను నడిపించే సైద్ధాంతిక అంశాలు కేవలం అంతర్గత అవ గాహనగా మాత్రమే ఉండటానికి నిరంతరం హెచ్చ రించుకున్నాను.

సుమారు ఆరేళ్ల పాటు ‘నీల’ రచన సాగింది. రచన స్థితి, రచన అందించే గాఢత ఏ కోశాన చెదరలేదు. ఆరేళ్లుగా ‘నీలతో’ మీ ప్రయాణం ఎలా సాగింది? ఇంతకాలం ఒక రచనని ఎలా బాలెన్స్ చేయగలిగారు?

నా వ్యక్తిగత, సాహిత్య జీవితాల్లో ఈ నవల పూర్తి చేయడం అనే అంశానికి ప్రథమ ప్రాధ్యాన్యతని ఇచ్చాను. రక్తమాంసాలని అంటిపెట్టుకుని కాపాడే చర్మపుతీరున నవల నన్ను అతుక్కుని ఉంది, అది నా ఆకాంక్షా, దానికి ఉన్న శ క్తా, లేక రెండూనా అన్నది తెలీదు. ఇంట్లో ఉన్నా బైటకి వెళ్ళినా బస్సులో కూచున్నా, యాంత్రికమైన ఏ పని చేసు ్తన్నా లోపల ఒక మననం సాగుతూ ఉండేది. దాని వల్లనే ఇన్నేళ్ళ ప్రయాణం సాధ్యపడింది.

‘నీల’ ఇలా రూపొందటం వెనుక మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏమిటి ?

సామాజిక రంగంలో అప్పటికి ఉన్న అవగాహనకి తోడు, నవల రాయడానికి ముందు, రాసే క్రమంలోనూ చాలా చోట్లకి తిరిగాను. సెలవులు వస్తే చాలు ఏలూరు వెళ్లి చుట్టుపక్కల గ్రామాలు తిరిగేదాన్ని. మా ఊళ్ళోనే చాలా చరిత్ర ఉంది. పంచాయితీ ఆఫీసులో కూచుంటే వర్తమాన గ్రామాలు నివ్వెరపరిచే నిజాలు చెపుతాయి. అట్లాగే పొదుపు సంఘాల గురించి చిత్రగారు (వేలూరి రామారావు) చాలా విషయాలు చెప్పడమే కాకుండా రెండుమూడు గ్రామాలు తిప్పి స్వయంగా ఆడవాళ్ళ నుంచి నిజాలు రాబట్టుకునేలా చేశారు. నారాయణ వేణు చోడవరం పరిసర గ్రామాలకి తీసుకువెళ్ళారు. ఈ పర్యటనలన్నీ రెండు ప్రాంతాల పొదుపుసంఘాల తారతమ్య పరిశీలనకి, అవగా హనని మెరుగు పరుచుకోవడానికి తోడ్పడ్డాయి.

నవలలో అన్నీ సజీవపాత్రలే. సంపూర్ణ, సరళ, అజితల వ్యక్తిత్వ తారతమ్యాలను ఎలా గ్రహించాలి?

ఆ మూడు పాత్రలూ వరుసగా శ్రామిక తరగతి, మధ్య తరగతి, మెట్రో తరగతి స్త్రీల జీవితాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. వర్తమాన సమాజంలో ఈ మూడుతరగతుల మధ్య భేదాలే నవలలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చే శాను. అయితే కులవర్గ ప్రాంతాల పరంగా ఉండే వైరుధ్యా లను గుర్తిస్తూనే జెండర్ ఏకసూత్రతని నిలబెటా ్టలనుకున్నాను.

‘నీల’ పాత్రని నడిపించే సైద్ధాంతిక చోదక శక్తిని తీర్చిదిద్దినదేది?

నవలలో విషయం మీరు అడిగి ఉంటే కనుక, నీలకి సైద్ధాంతిక అవగాహన కలగడానికి ప్రేరణ అయినవాళ్లలో వసుంధర, ఆ ఇంటి వాతావరణం, సదాశివ, అతని వ్యకి ్తగత, సామాజిక, రాజకీయ ఆచరణలు. కొంతమేరకి పరదేశి. మళ్ళీ దానినంతటినీ ఆమె జీవితాలకి అన్వయించి చూసు కుంటూ సాగింది.

ఇపుడున్న వాతావరణంలో ‘నీల’ నవల ఎలాంటి కదలికలను కలిగించాలని అనుకుంటున్నారు?

మన ఉద్దేశాలు ఏవైనా ఉండొచ్చు, ఫలితాల నుంచి మాత్రమే మాట్లాడుకోగలం. ఒక పుస్తకం వెంటనే దాని ప్ర భావం చూపకపోవచ్చు, కొన్ని పుస్తకాలు కాలాలు గడిచాక అవసరంలోకి రావొచ్చు. ఇరవై ఏళ్ల అమ్మాయిల నుంచి ఎన బై ఏళ్ల పెద్దల వరకూ నవలని ప్రేమగా చదవడం ఒక ఫలి తం. నా వరకూ వచ్చిన స్పందనల్లో ఆసక్తిగా అనిపించిన పరిశీలన ఒకటి ఉంది. ముప్పై నుంచి యాబై ఏళ్ల మ ధ్య వయసున్న స్త్రీలను ఈ నవల కలవరానికి గురి చేసింది. విలువల ఘర్షణ జరుగుతున్నదని గ్రహిం చాను. ఇది కూడా నేను కోరుకున్నాను.

సైద్ధాంతిక భూమికలోంచి నీలని ఎలా చూడాలి? ఈ కోణంలో నీల నవలకి వున్న పరిమితులేమిటి, దాని విస్తరణా స్వభావం ఏమిటి ?

ఒక నవల చదవడం కోసం సైద్ధాంతిక అంశాల అవసరాన్ని అందరు పాఠకులు కోరు కోరు. కొంతమందికి అది చాలా అవసరం, అ ట్లాగే విమర్శకి సామాజిక శాస్త్రాలు, సిద్ధాంతాలు, ధోరణులు పనిముట్లు. మార్క్సిజం, అస్తిత్వవాదా లలో నుంచి నవలని చూడొచ్చు. స్థూలంగా – మా ర్క్సిజం మానవాళికి మేలు చేసే సిద్ధాంతం అని నమ్మి నా, సూక్ష్మస్థాయిలో కూడా బలంగా వ్యాఖ్యానించగల శక్తి నాకు లేదు. అనేక సందేహాలు, సంఘర్షణల మధ్యన ఉన్నాను. ఈ స్వభావం నవలకి కూడా పరిమితిగా మారిం దని నా అభిప్రాయం. అస్తిత్వధోరణుల సంక్లిష్టతలను దాటి, వారంతా సమూహంగా సాధించిన చిన్న చిన్న విజయా లను ఎత్తి చూపడమే దాని విస్తరణ.

స్త్రీ వాద సాహిత్యానికి ‘నీల’ కొత్త చేర్పు అనుకోవచ్చా?

అది విమర్శకులు చెప్పాలి. ‘నీల – చివరికి మిగిలేది – నవలల తారతమ్య పరిశీలన’ అన్న అంశానికి ఎంచుకుని ఒక జెఆర్‌ఎఫ్ స్కాలర్ పరిశోధన మొదలు పెట్టాడు. చూద్దాం ఏం చెపుతాడో.

ప్రరవేలో పనిచేయడం అనేది ‘నీల’ పాత్రని రూపొందించడంలో ఎంతమేరకు దోహదపడింది?

ప్రరవేలో పనిచేయడం అన్నది నా వ్యక్తిత్వాన్ని చాలా మార్చింది. జాజుల గౌరి, రత్నమాలక్క, పుట్ల హేమలత, కాత్యామేడం లాంటి వారి భుజాల మీద చేతులు వేసుకుని స్నేహితుల మాదిరి వర్తించగల ప్రజాస్వామికతని పరిచయం చేసింది. నిర్మాణాల్లో ఉండటం వల్ల పనికిమాలిన అహాలు చాలా మేరకి నశించి, సహనంగా ఆలోచించడం అలవాట వుతుంది. సమూహంలో ఉంటూనే నాకు నేనుగా నిలబడ టానికి ప్రరవే ప్రణాళిక సాయపడింది. ఇట్లా గ్రహించింది ఏది ఉందో ఆ మేరకి ఆ ప్రభావం నీల పాత్ర రూపకల్పనలో కూడా ఉంటుంది.

‘నీల’ నవలలో దళిత, విప్లవకోణాలని మేళవించడం అనేది నవల పునాదిలోనే వుంది. దీనిని వర్తమానానికి అనువర్తింప
చేయడంలో మీ ఆలోచనలేమిటి ? నవల ఏ మేరకు సాధ్యం చేసింది?

నిజానికి ఈ నవల విషయంలో సైద్ధాంతిక అంశాలు ముందుకు తోసుకు రాకుండా ఉండటానికి కఠిన నియమం చేసుకున్నాను. జీవితాలు అన్నీ మాట్లాడతాయి. పచ్చి వాస్త వికత ఉంటుంది. దానిని యథాతథంగా చెప్పేపుడు కళారూ పాలకి ఉండవలసిన ప్రాథమిక విలువల్ని గౌరవిస్తే చాలు. జీవితాలు మాట్లాడేవాటికి ఆకృతి కల్పించడంలో నాకున్న సైద్ధాంతిక అవగాహన అంతర్గతంగా పనిచేసి ఉండొచ్చు.

నవలలో హైందవ ఆధిపత్య భావజాలం చంద్రకళ చావు నుంచి సంపూర్ణ రాజకీయ ఎదుగుదల క్రమం వరకూ వుంది. ఈ
అవగాహనలో పూర్ణ పాత్ర విలువైనది. హైందవ ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే వ్యూహాన్ని నవల ఎంతవరకు సొంతం చేసుకుందనొచ్చు?

ఏ మతమైనా పితృస్వామ్యానికి భిన్నం కాదు. కాకపోతే భారతీయ సమాజంలో హిందూమతం, మెజారిటీ మతంగా ఉంది కనుక పితృస్వామ్యాన్ని అమలు చేయడంలో దాని పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చంద్రకళ మరణం విష యంలో అది పరోక్షశక్తి కావొచ్చు, పూర్ణ రాజకీయ ప్రయా ణంలో ప్రత్యక్షశక్తి కావొచ్చు. స్త్రీ పురుష సంబంధాల విషయంలో పైకి మేధావుల్లా మాట్లాడేవారు సైతం వ్యక్తిగతంలో ఎంత అల్పత్వంతో ఉంటారో చెపుతూ మా చందు ఒకమాట అంటాడు, ‘పైకి ఇన్ని కబుర్లు చెప్పే ప్రతి మగవాడి మనసు లోనూ ఒక భజరంగదళ్ కార్యకర్త ఉంటాడు’ అని. చంద్రకళ, పూర్ణ, నీల, వసుంధర, సదాశివ, మరీ ముఖ్యంగా అజిత – అటువంటి భావజాలాన్ని చావుదెబ్బ తీసిన పాత్రలే.

‘నీల’ నవలని ప్రధానంగా స్త్రీల సంఘర్షణలోంచి విస్తారంగా విశ్లేషణ చేసుకోవాల్సి వుంటుంది. మీరేమంటారు ?

ఆ గంటావీరులెవ్వరు?! అయినా అది నా పరిధిని దాటి న అంశం. నవలని అనేక మాధ్యమాల ద్వారా ఎక్కువ మందికి చేరేలా చూసుకోవడం కూడా రచయితల బాధ్యత అయింది. అదే పెద్దపని. విశ్లేషణలు వస్తే మంచిదేగా! లోకం గుర్తించే మంచీ చెడూ ఎట్లా ఉన్నాయో మనకీ తెలుస్తుంది.

స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామీకరణం చెందటం అనేది నేటి సామాజికావరణంలో ఎలాంటి పాత్రని నిర్వహిస్తుందను కుంటున్నారు?

మానవ సంబంధాలు ప్రజాస్వామీకరణ చెందడం అనేదే చాలా కష్టమైన విషయం. ఇక లైంగిక నియంత్రణ బలంగా ఉండే స్త్రీ పురుష సంబంధాల విషయంలో అది మరింత కష్టం. పెట్టుబడిదారీ సమాజం ఎంత దుర్మార ్గమైనదైనా దాని ప్రయోజనాల కోసం కొన్ని ప్రజాస్వామిక విలువలని అనుమతిస్తుంది. స్త్రీలూ పురుషులు తమ బంధా లను నిలుపుకోవడానికి చేసుకుంటున్న సర్దుబాట్లను అందు లో భాగంగా చూస్తున్నాను.

స్త్రీవాద సాహిత్యంలో ఏవైనా ఒకటి రెండు మూస దోరణులను ఈ నవల బద్దలు కొట్టిందనుకోవచ్చా?

తొలి అడుగులకి విభ్రమ గొలిపే ఆదరణ ఉంటుంది కనుక మూస ఏర్పడుతుంది. తదనంతర సాహిత్యానికి దాని ని బద్దలుకొట్టే శక్తి సహజంగానే ఉంటుంది. కాలంవల్ల కూడా అది సాధ్యపడుతుంది. సంపూర్ణ, సరళ, నీల, పరదేశి, మినో పాత్రల చుట్టూ ఉన్న జీవితాలను, ఘటనలను రాస్తున్నపుడు మూసకి భి న్నంగా ఉన్నట్లు నాకు తోచింది. వాస్తవాన్ని విశ్లేషకులు చెప్పాలి.

అనేకులు ఆర్థిక అసమ సంబంధాల వలలో వున్న నేటికాలంలో సదాశివలాంటి పాత్రని నిజజీవితంలో వూహించొచ్చా? సామాన్య పేదజనం నుంచి సదాశివలు రూపొందే అవకాశాలను గురించి చెప్పండి?

వ్యక్తులు ఉదాత్తంగా ఉండటానికి – స్వేచ్ఛకి, విలువల ప్రయోగాలు చేయడానికి-ఆర్థిక స్థితిగతులకూ దగ్గర సంబం ధం ఉందని గుర్తించినపుడు నా గుండె కదలబారింది. సామాన్య పేదజనం పేదగానే ఉన్నపుడు సదాశివలు అక్కడి నుంచి రావడం అత్యంత అరుదు.

చంద్రకళకి, మినోకి వారధి నీల. పురోగామి మార్గంలో పయనించే పాత్ర నీలది. మినో భవిష్యత్తుపై నీల, సదాశివల భయాన్ని నవల ఈ కోణంలోంచి ఎలా అంచనా వేయాలి?

నవలకి రాసిన ముందుమాటలో ఈ స్థితిని వీరభద్రుడు చర్చించారు. పరిణామం రేఖీయంగా ఉండటం ఆధు నిక భావన అని, అది వర్తులంగా ఉంటుందని చెప్పే అత్యాధు నిక దశలో ఉన్నామని, దానికి మినో పాత్రని ఉదాహరణగా చూపించారు. ‘స్వేఛ్చ గురించి నీల వేసుకున్న ప్రశ్నలే ఇపుడు ఆమె కూతురు మినో వెయ్యడం కథని వర్తులం చేసింది’ అంటారాయన.

‘నీల’ నవల వచ్చిన ఈ సందర్భం ప్రత్యేకమైనది. ఒక సామాజిక స్పృహని అందించిన నవల. ఈ సందర్భంలో రాబోయే మీ తదుపరి రచనలను ఎలా నిర్వహించబోతున్నారు? రాబోయే రచనలపై నీల ప్రభావం ఎంత వుంటుంది?

వర్తమానంలో గిరిజనుల జీవితాలు నాకు ఎలా అర్థమ వుతున్నాయో రాయాలని ఉంది. ఇంకా ఒకటి రెండు అంశా లు మనసులో మెదులుతున్నాయి. మరీ అవసరం పడితే తప్ప – కొన్నేళ్ళపాటు నవలా ప్రక్రియలోనే ఉంటాను. నీల గురించి చాలామంది మాట్లాడుతున్నారు, ఆ స్పందనల ప్రభావం, తర్వాతి రచనల మీద అసాధారణ స్థాయిలో అయితే ఉండదు. ఏ రచన నేపథ్యం, దానికది స్వతంత్రంగానే ఉంటుంది. నీలలో వచ్చిన చిన్నచిన్న తప్పొ ప్పుల స్పృహ మాత్రం ఉండొచ్చు.

చివరగా ‘నీల’ నవల ద్వారా మీరు ఆకాంక్షిస్తున్నది ఒక్క మాటలో చెప్పండి?

లైంగిక విలువల పేరుతో పురుషులూ స్త్రీలూ సాగించే, గురయ్యే హింస నుంచి విముక్తి పొందాలి.

ఇంటర్వ్యూ : బాల సుధాకర్ మౌళి
కవి, ఉపాధ్యాయుడు

 

 

ఐఐటి ఫ్రొఫెసర్ – నీల

 

మంచి అనువాదకురాలు,  IIT B ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయిన కల్లూరి శ్యామల గారి విమర్శనాత్మక సమీక్ష.
ఇంతకు ముందు నేను రాసిన ఒక నవలికని సాఫ్ట్ వేర్ ఫర్ లైఫ్ పేరుతో అనువాదం కూడా చేసారు.

******************

నీల:

కె.ఎన్. మల్లీశ్వరి

కె.ఎన్ మల్లీశ్వరి గారు, ‘ఎ సాఫ్ట్వేర్ ఫర్ లైఫ్’, ‘సి బాచ్ అమ్మాయి’, ‘జాజిమల్లి’ తదితర నవలలు, కథా సంపుటుల ద్వారా తెలుగు పాఠకులకు సుపరిచితులే! కేవలం నవలారచయిత్రి గానే గాక సాహితీ విమర్శకురాలిగా, స్త్రీ వాద సిద్దాంత దృక్పధంతో రాసిన అనేక వ్యాస, కథా, నవలా, పత్రికా రచయిత్రిగా తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నారు. ప్రస్థుతం విశాఖ నివాసి. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి విశాఖలో విద్యాభ్యాసం చేసి అక్కడే ఉద్యోగ రీత్యా స్థిరపడిన ఈమె ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకి నిర్మాణ స్థాయినుంచి సేవలందిస్తున్నారు. ఆమె క్రొత్త నవల నీలని అమెరికా సాహితీ సంస్కృతీ సంస్థ తానా గుర్తించి బహుమతినివ్వడం ప్రతిభని గుర్తించి గౌరవించడమే!

ఇక నీల గురించి: నీల అనే యువతి ముఖ్యభూమికగా వున్న ఈ నవలలో ఆమె సామాజికనేపధ్యం, పేదరికం, వెనుక బడిన జాతికి చెంది వుండడం వలన ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, చదువుకోవాలనే ఆమె తపన, అణచివేతల నేపధ్యంలో అనాధగా మిగిలిన నీల జీవన సంగ్రామం అన్నీ కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించారు మల్లీశ్వరి. ఈ కథాకథన శక్తి చదువరులని పట్టి విడవకుండా పుస్తకాన్ని చదివిస్తుందనేది నిర్వివాదాంశమైనా కధాప్రవాహంలో కొట్టుకుపోతూ ఆలోచించలేని కొన్ని విషయాలు పుస్తకం మూసేశాక ప్రశ్నార్థకాలుగా మిగులుతాయి. మిగిలిన సమకాలీన రచయిత్రుల కన్నా మల్లీశ్వరి ధృక్పధంలో విశేషమైన దేమిటి అని ప్రశ్నించుకుంటే కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా నిలబడతాయి.

 

నీల తల్లి తాగుబోతు భర్తని పిల్లలిని పోషిస్తూ నీల అంటే తల్లిగా మమకారాభిమానలతో వుంటుంది. అయితే అన్ని విధాల తన భర్తకి విరుద్దంగా వుంటూ తనపట్ల ప్రేమ చూపించటంతో ఒక అతనిని అభిమానించి దగ్గిరవుతుంది. దానిని అనైతిక సంబంధంగా ఆమె సమాజం తీర్మానించి నీలతో సహా కుటుంబాన్ని వెలివేస్తుంది. తల్లి పట్ల సమాజం వ్యవహరించిన తీరు పట్ల వివక్షతకి గురైన నీల తన జీవితంలో ఒక బంధానికి కట్టుబడి ఉండాలని అనుకుంటుంది. కాని ఒక రకంగా ఆమెని పెంచిన పెద్దలు  ప్రసాద్ తో నిర్ణయించిన బంధం కనుక ఆమె తనంత తానుగా కోరుకుని చేసినది కాదు కనుక అతనితో పూర్వ పరిచయం లేదు కనుకా అతని స్వభావాన్ని అంచనా వెయ్యలేకపోయింది. దుర్మార్గుడు కాక పోయినా పితృసామ్య భావజాలంలో పెరిగినవాడు కావడం వలన తన ప్రవర్తనలో లోపాలు గ్రహించుకోలేక ఆమె బయటికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా  అనుమానిస్తూ అభిమానం ప్రేమ పేరిట కట్టడి చెయ్యాలని ప్రయత్నించటమే కాక తనమాట నెగ్గితీరాలాని కూడా అనుకుంటాడు. ఇద్దరితో సంబంధాలను నడుపుతూ ఏ ఒక్కదాన్ని ఒదలలేక సతమవుతాడు. ఎప్పుడైతే ఆమె వదిలేసి వెల్తుందో అప్పుడే ఆమె భర్తకి మరొక్క స్త్రీతో వున్న సంబంధం మెరుగున పడుతుంది.

 

ఆ విధంగా వివాహ వ్యవస్థ వల్ల వచ్చే సహజీవనం తనకి పనికి రాదనే నిర్ణయానికి వస్తుందని అనుకోవచ్చును. అంతకు ముందు దాకా తల్లి లాగా సమాజం గర్హించే వ్యక్తిగా మారకూడదనే తాపత్రయ పడుతుంది. తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన వాడు పరదేశి. దాదాపు ఒక నెల్లాళ్ళు ఏ సమస్యలేదు తర్వాత మాత్రం అతని  ప్రేయసితో తెగతెంపులు చేసుకుని నీలతో వుండటానికి సిద్దపడతాడు. అయితే అప్పటికే ఒక బంధానికి కట్టుబడి వున్నవ్యక్తి జీవితంలోకి రెండవ స్త్రీ గా ప్రవేశిస్తే అందులో వుండే సాధకభాధకాలెరిగున్న వ్యక్తి కనుక అతన్ని వద్దనుకుని వచ్చేస్తుంది. తర్వాత చివరిగా ఆమె జీవితంలో ప్రవేశించిన వ్యక్తి సదాశివ అన్నిరకాలా ఉత్తముడు మంచి ప్రేమికుడు. నీలలా సరైన సహచర్యంకోసం అన్వేషిస్తున్న వాడు అయిన సదాశివతో చక్కని జీవితంలో స్థిరపడుతుంది. అయితే నీలే కాదు ఏ రకమైన చేదు అనుభవాలు ప్రేమపరంగా లేని సదాశివ కూడా సహజీవనాన్నేకోరుకుంటాడు కానీ వివాహాన్ని కోరుకోడు.

 

ఇక్కడే వివాహ వ్యవస్థ పట్ల రచయిత్రిలో ఒక రకమైన వ్యతిరిక్తత కనిపిస్తుంది. మానవ సమాజంలో సహజీవనానికి ఈనాటి సమాజంలో రెండు ముఖ్హ్యమైన పద్దతులున్నాయి – వివాహమొక్కటైతే ఈ ప్రక్రియలేకుండా సహజీవనం చెయ్యడం రెండవది. నేటికాలపు రచయిత్రులలో సహజీవనం పట్ల ఆకర్షణ పెరగటం చూస్తున్నాము. స్త్రీ స్వేచ్చకి ఇదొక మార్గంగా వాళ్ళు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ అవగాహన గూడా మల్లీశ్వరికి వున్నట్టే అనిపించినా స్పష్టత లోపించినట్టని పించింది. సమస్యలపరంగా చూస్తే రెండింట్లోనూ సమస్యలున్నాయి. ప్రేమ వత్తిడి బాధ్యతలు లేని జీవితం వలన రెండిటిలోనూ నష్టాలున్నాయి. ఒక సామాజిక కట్టుబాటు వివాహప్రక్రియతో వస్తుందనుకుంటే ఇది లేకుండా కూడా నియమబద్ధంగా బాధ్యతాయుతంగా వుండవచ్చునని సదాశివలాంటి వాళ్ళు చెపుతారు.

 

అతని అనుభవాలకి సంబంధించినంత మట్టుకు అతనికి వివాహాన్ని వద్దనుకోవాటానికి కారణాలేమీ లేవు, ఒక్క స్వేచ్చగా ఒకటి కంటే ఎక్కువ మందిస్త్రీలతో బాంధవ్యాన్ని పెంచుకుని తనకి మనస్సుకి నచ్చిన బంధం తారసపడినప్పుడు స్థిరపడదామనుకోవడం తప్ప. ఇలాంటి జీవనవిధానం వ్యక్తిగతంగా ఎవరో ఒకరికి నమ్మిన సూత్రంగా మారి దానికి కట్టుబడటంలోను వివాహవ్యవస్థకి దీనిని ఒక పర్యాయ వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకునే నేటి రచయిత్రుల ఆకాంక్షకీ చాలా తేడా వుంది. మొత్తం సమాజంలో దీనిని ఒక వ్యవస్థ గా తీర్చిదిద్దాలంటే ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా ఈ బంధాలలో ఇమిడిన వ్యక్తుల సంతానానికి ఎలాంటి సమస్యలు రావచ్చో నీల జీవితమే ఒక ఉదాహరణ కదా! ఆమె కూతురు కథ చివర్లో కన్నతల్లినీ కనని తండ్రినీ కూడా లెక్కచెయ్యకపోవడమే కాక అవమానకరంగా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత వస్తాను ఏ తప్పు చెయ్యను నమ్మండి అని చెప్పి మరీ వెళ్తుంది. ఆమె బాల్యంనుంచి జరిగిన సంఘటనల నేపధ్యంలో తప్పు అని ఆమె దేనిని అనుకుంటుందో స్పష్టమయిన అవగాహన ఆమెకి వున్నట్లు దాఖలాలు కనిపించవు. సదాశివని ఆమె తండ్రిగా భావిస్తున్నదా లేదా అనేది స్పష్టమవలేదు. అతనితో చిన్నతనపు బాంధవ్యంలో వున్న చనువు పెద్దయ్యాకా కనిపించవు. పేరుపెట్టి పిలుస్తుంది. దెబ్బలాడుతుంది అధికారంతో సాధించుకోవాలని చూస్తుంది, అప్పుడప్పుడు అవమానకరంగా కూడా మాట్లాడుతుంది. అవతల వ్యక్తికివాల్సిన మర్యాదని ఇవ్వని వ్యక్తిగా పెరుగుతుంది. బ్రతకడానికి కావాల్సిన సర్వైవల్ ఇన్స్ట్ంక్ట్క్స్ లా అనిపిస్తాయి. పోట్లాడయినా సాధించుకోవాలనే మనస్తత్వం రావడానికి కారణాలని విశ్లేషించాల్సిన అవసరముంది.

 

 

ఈ రకమైన మానవసంబంధాల విశ్లేషణ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు చదివిన అయాన్ రాండ్ నవలలు గుర్తొచ్చాయి. అమె రచించిన రెండు ప్రసిద్ద నవలలో ఈ రకమైన ఆదర్శప్రాయమైన సహచరుల వెతుకులాట అన్వేషణ కనిపిస్తాయి. ఫౌంటెన్ హెడ్ లో అట్టడుగు విలువలు కలిగిన వ్యక్తి నుంచి నాయిక విలువలు ఆదర్శ ప్రేమ వున్న అత్యున్నత స్థాయి వ్యక్తి దాకా ఎదుగుతుంది ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రతిభా వంతులు సృజనాత్మకంగా ఉద్దండులు మొదటివాడు తప్ప. అయితే పరాన్నబ్రుక్కులుగా ప్రక్కవాడి ప్రతిభ మీద బతికెయ్యాలనుకునే ఆశతో వున్నబ్రతికే సమాజం, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతిభకి స్వేచ్చగా బ్రతికే వెసులుబాటు వుండదు. రెండవ నవలలో అందరూ సమానమైన ప్రతిభ వున్నవాళ్ళే! అయితే ఒకణ్ణి మించిన వ్యక్తిత్వం మరొకడిది. ముగ్గురు నాయకులు. నాయిక తన అన్వేషణలో చివరికి కావాల్సిన వాణ్ణి చేరుకుంటుంది. ఈ రకమైన యుటొపియన్ సమాజంలో జీవితంలో వుండదు, రాదు, ఎందుకంటే ప్రతిమనిషిలో మంచీ చెడూ రెండూ వుంటాయి. మానవసంబంధాలు ఈ ఆర్థికపరమైన సూత్రాలకి అతీతంగా వుంటాయి. వుండాలి కూడా. మొత్తానికి చదించే ఆలోచింపచేసే నవల మల్లీశ్వరిగారి “నీల”. మన మధ్య చాలాకాలం వుంటుంది.

నీల నీలాంబరం

కల్యాణి గారు విశాఖ వాసులు. సాహిత్యాన్ని తాత్విక సామాజిక కోణాలతో అంచనా వేయగలవారు. నీల నవలపై తన ఆలోచనలు పంచుకున్నారు

******************************

 

నీల పుస్తకం చదివి ముగించా ,కానీ నీల నా మనసులో తిరుగుతూనే వుంది .

నీల లాంటి నవలకోసం చాలా కాలంగా వెతుకుతున్నా :వ్యక్తి ,సమాజం రెండింటిని కలిపి పరిశీలించే నవల .తెలుగులో చాలా అద్భుతమైన నవలలు వచ్చాయి ,సందేహం లేదు. ఏదైనా ఒక సామాజిక ,రాజకీయ ,స్త్రీవాద కోణాలనుండి .లేదా ఒక మూవ్మెంట్ గురించి వచ్చిన నవలల్లో రచయిత ఒక పాత్ర ద్వారా తన సమర్థించే ధోరణిని వెలిబుచ్చుతారు .అప్పుడు మనకు నాయక ,ప్రతినాయక పాత్రలు పాఠకులు ఎవర్ని సమర్థించాలన్న విషయంలో సందిగ్ధత ఉండదు.అలాంటి నవలల్లో పాఠకుడు ప్రేక్షకుడు మాత్రమే.


నీల లో రచయిత్రి లోపలా బయటా కూడా వున్నారు ,అందువలనే అన్ని పాత్రల్నీ సమగ్రంగా తీసుకుని రాగలిగారు . Reconciliation of apparent contradiction చక్కగా చేశారు .సరళ చేసిన పని తాను చేయకూడదు అని పరదేశి జీవితంనుండి వైదొలగిన వ్యక్తి అనేకులతో సంబంధం పెట్టుకున్న సదాశివతో సహజీవనం గడపడానికి ఒప్పుకుంటుంది .సహజీవనమైనా వివాహబంధమైనా భావనలలో మార్పు రావచ్చన్న భయం ఉంటుంది ,కానీ దాన్ని ఎలా ఎదుర్కొనాలన్నది వ్యక్తుల విజ్ఞతమీద ఆధారపడి ఉంటుంది ,ప్రసాద్ ,పరదేశి ,సదాశివ ఉదాహరణలు దీనికి.
ఒక టైమ్ లైన్ తీసుకుని ఆ చట్రంలో సమాజంలో వచ్చిన పరిణామాలు ,మారిన విలువలు ,రాజకీయాలు బిగించడంలో మంచి నైపుణ్యం చూపించారు మల్లీశ్వరి గారు .


పైడమ్మ కథ విడిగా వస్తే బాగుండేదని చాలా అనిపించింది ,అది అపురూపమైన వజ్రం .ఇన్ని వైవిధ్యం ఉన్న పాత్రలు ,సంఘటనలమధ్య ఎత్తి చూపడం కష్టం .


తెలుగు నవల కొత్త శకం మొదలైంది నీలతో .అభినందనలు మల్లీశ్వరి గారూ

చారిత్రాత్మక లేఖ

ఇఫ్టూ రాష్ట్ర నాయకులు, పి. ప్రసాద్ గారు, గంగాధర్ గారికి రాసిన లేఖ ఇది. ఇంత చరిత్రని ఇలా తెలుసుకోవడం బావుంది. చైతన్యవేదిక, ఏలూరు నిర్వహించిన పాత్రని మొదటిసారి వింటున్నాను. ఇలాంటి చైతన్యాన్ని తేవడం మామూలు విషయం కాదు. వామపక్ష పార్టీల మధ్య స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలీదు. కానీ చైతన్యవేదిక ఒక వారధిగా నిలబడి మొన్న కార్యక్రమం చేయడం మంచి పరిణామం. అందుకు నీల నవల పరిచయ సభ ఒక సందర్భం కావడం నన్ను ఉద్వేగానికి గురిచేస్తోంది. ప్రసాద్ గారు రాసిన ఈ లేఖ పశ్చిమ వామపక్ష స్థానిక రాజకీయాల మీద ఒక చారిత్రాత్మక పత్రం. కలిసి వచ్చే పనుల విషయంలో ఈ ఐక్యత కొనసాగాలి. గంగాధర్ గారు లాంటి వారు చొరవని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

*************************

 

పూర్వచైతన్య వేదిక నిర్వాహకులకు!(మిత్రులు గంగాధర్ గారి ద్వారా) ప్రియ మిత్రులారా, ఏలూరు జూట్ మిల్ మహిళ కార్మికుల పోరాట నేపధ్య0తో మొన్న అనగా 20-1-2018న మల్లీశ్వరి గారి (జాజి మల్లి) విరచిత “నీల”పుస్తక పరిచయసభ నిర్వహణకి మీరు చొరవ తీసుకోవడం చాలా చాలా అభినందనీయం!

మీకు తెలుసో లేదో గానీ ఒక పాత విషయం మీ దృష్టికి తేవడ0 చాలా సందర్భోచితమైనదిగా భావిస్తున్నా.1981 నుండి 1986 వరకు ఏలూరులో “ఎవరికీ పెద్ద గా తెలియని గుర్తింపులేని ఆర్గనైజర్”గా ఉన్న కాలంలో నేను నాటి “చైతన్య వేదిక” సభలకు నేను నిత్య శ్రోతని. నేను అప్పటికే జూట్ కార్మికుల్లో అజ్ఞాత నిర్మాణ కృషి ని సాగిస్తున్నాను.(నాలుగైదు ఏళ్ల నిరంతర ground work తర్వాతే 1986 లో 8గంటల పని దినంకై మహిళా కార్మికుల పోరు బ్రేక్ అయ్యుంది. తర్వాతే నేను “గుర్తింపు నేత” గా మారి మీ “చైతన్య వేదిక” సభలకు స్వేచ్ఛగా హాజరు కాలేని కొత్త భౌతిక స్థితి ఏర్పడినదనుకోండి) నాటి “చైతన్య వేదిక” సాహిత్య సభలకిఆకర్షితున్ని కూడా! అవి చాలా educative గా ఉండేవి. TVR గారు, గంగాధర్ గారు, హర్నాధ్ గారు, చందు& రాజారావు గార్ల సాహిత్య మిత్ర బృందం,ఇంకాజిల్లా స్థాయి లో సోమసుందర్ గారు, DVVS వర్మ గారు వంటి మరెందరినో అప్పటికే పరోక్షంగానైనా నేను బాగా ఎరుగుడును. సభలు ప్రారంభం కాగానే ఓ రకం “రహస్య ఫక్కీ” లో వచ్చి వెనక వరస కుర్చీల మీద కూర్చొని సభ ఆసాంతం శ్రద్ధగా విని,అవి ముగిసిన వెంటనే మీ నిర్వాహకుల దృష్టిలో పడకూడదన్న “మెలకువ”తో బిరబిరా ముందే బయటకు వచ్చే వాడిని. నాడు హాజరయ్యే అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులని చూసివిస్మయం చెందే వాడిని.

మరో వైపు గుస్సాసి (గుడిపూడి సాంబశివ రావు గారు, యాగాటి కనకాల రావు గారు, సింహాచలం గార్ల తో కూడిన హేతువాద బృందం ఏలూరులో భారీ స్థాయిలో నిర్వహించిన నాటి సభలకి కూడా బాగా హాజరయ్యేవాణ్ణి.”చైతన్య వేదిక” సాహిత్య, తాత్విక సభలకి పోటీగా (నిజమో కాదో కానీ నాకు ఆనాడు అలా అనిపించి “పోటీ” పదం వాడా.నెగిటివ్ పదం గా కాకుండా పాజిటివ్ రాజకీయస్పూర్తి తో ఈ పదప్రయోగం చేశానని గమనించండి) CPM కూడా ఇలాంటి కొన్ని సభల నిర్వాహనకి నాడు ప్రయత్నించింది. వాటికి కూడా హాజరయ్యే వాణ్ణి. ఐతే నా పరిశీలనలో మీ “చైతన్య వేదిక” మాత్రం క్రమం తప్పకుండా లోతైన రాజకీయ,తాత్విక, సాహితీఅంశాలపై సభలు, సెమినార్ల నిర్వాహణ ఒక నిరంతర ప్రక్రియ గా ఏళ్ల తరబడి కొనసాగింది.నేను వాటికి క్రమతప్పకుండా హాజరైన ఒక శ్రోతని.నాడు మీరూ నిర్వహించినసభల కి అత్యంత రాజకీయ జిజ్ఞాస తో వినే “టాప్ టెన్” శ్రోతలని ఎంపిక చేసి ఉంటే వారిలో నేనొకణ్ణిగా ఉంటానేమో(ఒకవేళ నాటి మీ రాజకీయ బృందంలో ఇంతకంటే ఎక్కువ జిజ్ఞాస పరులు పది మంది కంటే ఎక్కువమందే ఉంటారన్న అభిప్రాయం మీకు ఉంటే నేను డిబేట్ చేయబోను) ముఖ్య0గా YMHAహల్లో ఎటుకురి బలరామమూర్తి గారి తో నిర్వహించిన సభ నన్ను బాగా ఆకర్శించి0ది. ప్రాచీన భారత్ లో బౌద్ధం పోషించిన పాత్రపై నాకు ప్రాధమిక అవగాహనని కలిగించిన తొలిసభ అదే! ఆతర్వాతే “ఆబతనం”తో మార్క్సిస్టు తత్వశాస్త్ర అధ్యయన0 సాగించా. నాటి “చైతన్య వేదిక” సభలు, సెమినార్లు నా దృష్టిని మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనంపైకి అదనంగా మళ్లించడంలో ఉపయోగ పడ్డాయని సగర్వ0గా చెప్పగలను. అప్పుడు చైతన్య వేదిక తాత్విక, రాజకీయ అంశాలపై పెట్టె సభలకి హాజరయ్యేందుకు నా ఇతర ప్రోగ్రామ్స్ తేదీలని సవరించుకున్న నేపథ్యం ఉంది.ఒకసారి జంగారెడ్డి గూడెంలో ఒక ప్రోగ్రామ్ తేదీని మార్చుకున్నట్లు బాగా గుర్తున్నది. నాడు వాటిపట్ల నేను చాలా ఆసక్తి పరుడినని మీకు గుర్తు చెప్పడానికే వీటి ప్రస్తావన చేస్తున్నా.

ఈ సందర్బంగా మీకొక చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేయడం సందర్భ0 అనిపిస్తుంది. (ఒకవేళ మీరు దాన్ని అవసరమైన సమీక్షా0శంగా భావించి, రాజకీయ సానరాయి గా స్వీకరిస్తే అది చేదు స్మృతి కాబోదు.పైగా అది మీకోక మధుర స్మృతి కూడా కావచ్చు.అప్పుడు మీపట్ల ఈ అంచనాని బేషరతుగా నేను సవరించుకుంటా) అప్పుడు పలుమార్లు ఓ ప్రశ్న నన్ను వేధిస్తుండేది. “చైతన్య వేదిక” ఇలా0టి పాత్రనింపోషిస్తుంటే, దాని మాతృ రాజకీయ సంస్థ, ముఖ్యముగా దాని కార్మిక విభాగం అందుకు పూర్తి విరుద్ధ పాత్ర పోషించడం ఎలా సాధ్యం?” ఇదీ నాటి నా “ధర్మ సందేహ0”! (ఆ తర్వాత “ఏలూరు వరద నిరోధక ఉద్యమం” లో భాగంగా TVR గారితో ఏర్పడ్డ ఉద్యమబంధం నాకు కొంత వరకు అర్ధం చేయించిందనుకోండి)

నిజం చెప్పాలంటే నాటి మీ “చైతన్య వేదిక” తాత్విక, సాహిత్య సభల ద్వార పొందినమార్క్సిస్టు జ్ఞానం నన్ను మరింత దృఢమైన మార్క్సిస్టు చింతనాపరుడిగా తీర్చి దిద్దడంలో కొంతవరకి సహకరించింది. మరింత దృఢమైన విప్లవ కార్మిక యోధునిగా మలచడం లో కొంత తోడ్పాటుని ఇచ్చింది.వివరాలు సరిగ్గా గుర్తు లేకపోయినా ఓ సభ లో ఒక వక్త రాజకీయ ఉద్యమకారులుగా;కార్మిక పోరాటాలలోభాగస్వాము లుగా స్త్రీలని మలచలడం పై లెనిన్ బోధనల్ని గూర్చి ప్రసంగించారు.దీనినొక చారిత్రక అవసరమైన కర్తవ్యంగా లెనిన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళాకార్మికులని కార్మిక పోరాటాలలో సమీకరించే బాధ్యతని ఆనాడు నాకు బాగా గుర్తు చేసింది.అది తొలుత చుట్టల కార్మికుల్లో ఓ ప్రయోగంచేసి, తర్వాత జూట్ కార్మికరంగంలోనూ విజయం పొందడంలో నాకు అదనపు రాజకీయ స్ఫూర్తిని ఇచ్చింది.ఏలూర్ పట్టణ కార్మికోద్యమాల్లో, &ముఖ్యంగా ఏలూరు జూట్ మిల్ కార్మిక రంగం లో గత చరిత్ర ఏమిటో సమీక్షలు అప్రస్తుతం. ఆనాడు ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషించారో పక్కకి పెడదాం. (అట్టి సమీక్షలు రేపటి చరిత్ర నిర్మాణానికి అవసరమని మీరు భావిస్తే అది మీ సంబంధిత రాజకీయ కర్తవ్యం అనుకోండి) నాకు అది అసంబంధితం.కానీ మూడు దశాబ్దాలతర్వాత (ఈకాల నిర్ణయంలో చిరు పొరపాటు0టే మన్నింపు కోరతాను) ఏలూరులో పునరుద్దానం పొందడం ఎంతో ఆనంద దాయకం. పైగా ప్రతీఘాత ఫాసిస్ట్ రాజకీయ శక్తులు భారత దేశ రాజకీయ యవనికపై చెలరేగుతున్న నేటివిషమ కాలంలో నాటి మీ”చైతన్య వేదిక” రాజకీయ0గా ఒకవేళ పునరుజ్జీవం పొందితే వ్యక్తిగతంగా హర్షిస్తాను. నాటి స్థితి గతుల్లో అది మీ “వేదిక” కావచ్చు.కానీ నేటి స్థితి గతుల్లో మాత్రం అది “మన ఉమ్మడి వేదిక” గా పని చేస్తుందనేఅశాభావం ఉంది. అది మీ ఇష్టం. నేటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రగతిశీలభావుకులు లేదా ప్రేక్షక సానుభూతిపరులు గానే మిగిలిపోతారా;లేదా పాత్రధారులుగా కూడా మారతారా అనేది మీ ఇష్టమే! కానీ నా వ్యక్తిగత ఆశాభావాన్ని వ్యక్తం చేయడం నా ధర్మం. మీ వేదిక తో గత కాలపు నా అనుబంధం వల్ల చొరవ తీసుకొని ప్రస్తావించా. అందుకు మీరు అన్యాదా భావించరని ఆశిస్తా.

కొసమెరుపు:- ఏలూరు జూట్ మిల్లులో మహిళా కార్మికుల సమర శీల “ఎనిమిది గంటల పని దినం” పోరుకి దాదాపు మూడుదశాబ్దాలు ముగిసి పోయింది. ఈ నేపధ్య చరిత్ర గల “నీల” నవలా పరిచయసభ ద్వారానాటి మీ “చైతన్య వేదిక” మళ్లీ పునర్దర్శనం కావడమనేది నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందదాయకమైనది.మీ “చైతన్య వేదిక” కల్పించిన నాటి “చైతన్యం” కూడా నాటి జూట్ మహిళా కార్మికుల సమర శీల పోరులో ఎదో మేరకు అంతర్భాగంగా ఉంది. అది నిర్మాణ రూపంలో కాక పోవచ్చు.రాజకీయ రూపంలో కూడా కాక పోవచ్చు. ఆ రూపాలలో నాడు మనం పరస్పర విరుద్ధస్థానాలలో ఉన్నాం. కానీ నాటి నిర్మాణాలకూ, బాహ్య రాజకీయాలకూ వెనక పునాదిగా నిలిచే మౌలిక తాత్విక రంగంలో ఓ ఐక్యతా స్ఫూర్తి దాగి ఉంది.గాన నాటి సమర శీల కార్మిక పోరాటాలలో మీ “చైతన్య వేదిక”కూ ఓ పాత్ర ఉందనుకుంటున్నా. కాకతాలీయంగానైనా అది నేడు అదే(deto)మహిళా కార్మిక పోరాట నేపధ్య పాత్రా పోషణతోనే తిరిగి ముప్పయి ఏళ్ల అజ్ఞాతం తర్వాత(ఈ పదం ఒకవేళ మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి)పునర్దర్శనం పొందడం విచిత్రమైనదే. అట్టి పునార్దర్శనంతో అది ఆగకుండా పునరుజ్జీవం కూడా పొందితే చాలా సంతోషిస్తా. నేటి ఫాసిస్ట్ రాజకీయ వ్యతిరేకపోషణ కు పునరుద్దానం కూడా పొందితే మరింత గర్వించే అంశమే కదా!

నాహృదయం ఎంతో స్పందించి రాస్తున్న ఈ వర్తమానాన్ని ఒక సందేశ0గా భావించయినా నాటి చైతన్య వేదిక నిర్వాహకులకు కూడా మీరు (గంగాధర్ గారు) పంపగలరు. TVR గారు, మొన్న మొన్ననే ముత్యాల సాంబశివరావు గారు,గుండుగోలను సత్య నారాయణగార్ల ఫోన్ నెంబర్లు నావద్ద ఉన్నాయి మీతో పాటు మిగిలిన ఈ ముగ్గురికీ పంపిస్తున్నా.
ఇట్లు, పి ప్రసాద్(IFTU)
22-1-2018

 

 

ఒక వైద్యుని దృష్టిలో…

మహేంద్ర కుమార్ గారు వృత్తి రీత్యా వైద్య సంబంధిత రంగం. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమాని, సమీక్షకులు. వారు నీల నవలని ఇలా సమీక్షించారు

******************************

 

హమ్మయ్య !! నీల చదవడం అయ్యింది .

అంతర్జాల ఆధారిత వివిధ వ్యామోహాలను తట్టుకుని ఈ నవలని పూర్తిజేయడమంటే , కథ , కథనం , కథా కాలం ఇట్లా ఏకబిగిన చదివించే అద్భుత గుణాన్ని కలిగి ఉండడమేనేమో !

ఒక అమ్మాయి మనుగడ కోసం పోరాటాన్ని అత్యంత సహజంగా సాగించిన విధానాన్ని చిత్రించిన నవల ఇది . 
నీల పరదేశికి రాసిన లేఖ ఎన్నదగినది , లేమి వల్ల ప్రేమను డిజర్వ్ అయి ఉన్నాను అంటుంది , దీని కోసమే తపన పడింది ఎల్లప్పుడూ . నాటకీయత లేకుండా , కథానాయిక హోదా తో కాకుండా నీలను మలచిన తీరు గొప్పది .
సంపూర్ణ : జీవితం మెరుగ్గా ఉండాలనుకున్నప్పుడు అందివచ్చిన అవకాశాలని విజయ సోపానాలు చేసుకోవాలని నిరూపించిన పాత్ర , అయితే సంపూర్ణ మూలాలనెప్పుడు మరువలేదు , నేడు ఇది అభిలషణీయం . 

అజిత : చైతన్య స్రవంతి లాంటి పాత్ర , స్వతంత్రంగా బతకాలనుకున్నప్పుడు ఎలా నిబ్బరం అవసరమో చూపిన పాత్ర ” కొద్దిగా ప్రేమిస్తే చాలు ప్లీజ్ ప్లీజ్” సిద్ధాంతం ఎంత వాస్తవం ! 

పరదేశి : నిజాయితీ నిబద్దత ఉన్నవాడు , నీలకి జీవితంపట్ల మరల ఆశలు చిగురించినవాడు రాద్ధాంతాలు , వ్యసనాలు లేకుండా జీవితాన్ని ఆలింగనం చేసుకున్నవాడు . పాఠకుడికి ఆర్ద్రంగా అవగతమయ్యేవాడు 

సదాశివ : కొంచం ఉన్నత సమాజం సంపర్కం వల్ల వచ్చిందో లేదా హృదయ వైశాల్యమో , స్త్రీ పురుష సంక్లిష్టతల్లో , ఇలాంటి వ్యక్తులు నేటి అవసరం , వీరిని మన సమాజం తయారు జేసుకోవాలి . 

పాష్టరమ్మ , ప్రసాదు , మినొ ఎవరూ నేల విడిచి సాము చేయలేదు .

ఓల్గా గారి ప్రభావం నుండి భయటపడ్డాననుకున్న రచయిత్రి , ఆ కొనసాగింపునేమో అన్నట్లుంది

ఎందుకోగానీ దయానిధికి , నీలకి సారూప్యత తళుక్కుమంది . 

చివరి పేజీల్లో నీల చేసుకున్న అవలోకనమే ఈ నవల విషయ సంగ్రహం .

స్వర్ణనీల

కిలారి స్వర్ణ – మంచి పాఠకురాలు, సాహిత్య సమీక్షకురాలు, త్వరలో మంచి అనువాద రచనని అందించబోతున్నారు. నీల నవలపై ఈ చిట్టి సమీక్ష చేసారు

 

నీల గురించి ఏం రాయాలి.? కేవలం ప్రేమ కోణాన్ని మాత్రమే స్పృశిస్తాను. 🙂

ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సదా మనుషులను ప్రేమించేవారు, ప్రేమరాహిత్యంలో కొట్టుకుపోతున్నవారూ ఇద్దరూ చదవాల్సిన నవల. రక్తసంబంధీకులే కొట్టుకు చస్తున్న ఈ రోజుల్లో అసలేమాత్రం సంబంధం లేని పైడమ్మ, పాష్టరమ్మల మీద ఏంటా వల్లమాలిన ప్రేమ.? ఎందుకా ప్రేమ? పరదేశి, నీల మద్య వున్న అమలినమయిన ప్రేమ..ఊహించగలమా..? ఇక సదా…ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి అద్భుతమయిన వ్యక్తులు వుంటారా..వుంటారనే నమ్మకం కలిగేలా ఆ అనుభూతిని కలిగేలా రాసిన రచయిత్రికి సదా కృతజ్ఞతలు 🙂. అతి మామూలు మనుషులే అయినా ప్రసాద్ , సరళ ల ప్రేమని కూడా తప్పు పట్టలేం. అది అవసరానికి ఏర్పరచుకున్న బంధం అయినా కూడా.

చిన్న స్పేస్ కోసం ఎంతగానో ఆరాటపడి తన ప్రాణాలే పోగొట్టుకున్న తల్లి గుర్తొచ్చి నీల అనుకునే మాటలు: ” అమ్మా! హాయిగా నచ్చినట్లు వుండు అని చెపాలనిపిస్తుంది “, బాగా నచ్చాయి.

మనుషుల్ని ఎంత చివరి వరకు వెళ్ళి ప్రేమిస్తే, అంతగా వాళ్ళని క్షమించేయొచ్చు. ఇలా ఎంత మంది ఆలోచిస్తారు. మనకి కీడు చేసాడు కాబట్టి..మనం కూడా ఎలాగయినా సరే పగ తీర్చుకోవాల్సిందే అన్నట్టుగా వుంటుంది కొందరి ప్రవర్తన. అలాంటి వాళ్ళకు చెంపపెట్టుగా వుంటుంది ఈ నవల.

సాఫీగా జరిగిపోయే కథ, పుస్తకం చదువుతున్నంత సేపూ ప్రేమవాహినిలో కొట్టుకుపోయేలా మనలందరినీ ఒక అనుభూతికి గురిచేసిన రచయిత్రి జాజి మల్లి గారికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే ! ఎక్కడా అసహజత్వం లేకుండా, సున్నితత్వం పోకుండా ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించారు. అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. మరమనుషుల్లా బ్రతుకుతున్న వాళ్ళకు ఒక ఆత్మీయ స్పర్శలా, చల్లని చిరుజల్లులా మాత్రం తగులుతుంది !

అక్క వెళ్ళిపోయింది

అక్క వెళ్ళిపోయింది

నలుగురిని ముగ్గురు చేస్తూ..
రెండేళ్ళ కిందటి జాజిమల్లి పాఠకులకి మా నలుగురక్కాచెల్లెళ్ళ పై నేను రాసిన కథలు గుర్తు ఉండే ఉంటాయి. ఒక ఖాళీని తడుముకునే ప్రయత్నం చేస్తుంటే అక్క వ్యక్తిత్వపు హిమవన్నగం దొరికింది మాకు. దానినే పుస్తక రూపంలో మిత్రులందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. పిడిఎఫ్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచుతున్నాను
మల్లీశ్వరి

  prayanam final

నీల – రవికాంత్ రెడ్డి విశ్లేషణ

న్యాయవాది, మంచి చదువరి, సామాజిక సమస్యలను తార్కికంగా వ్యాఖ్యానించే మాదిరెడ్డి రవికాంత్ రెడ్డి నీల నవలను ఆబ్జెక్టివ్ గా ఎట్లా అర్థం చేసుకోవచ్చో ఈ సమీక్షలో చెపుతున్నారు.

 

**********

ఆడవారికి మాత్రమే అనవసరమైన నీతులు బోధించే కండిషనింగ్ ఉన్న సమాజంలో ఈ నవల దానికి ధిక్కారమే అని చెప్పాలి. ప్రేమ జీవితంలో ఒకసారే కలుగుతుంది అనడం ఎంత ట్రాషో అదే ప్రేమ వల్ల కలిగే పక్షపాతం, దాన్ని కూడా అధిగమించే సహజ కాంప్లెక్సులూ, కర్తవ్యం, జీవితాశయాలు ఇవన్నీ ఆ ప్రేమను ప్రభావితం చేస్తాయనడం కూడా అంతే నిజం. నిజ జీవితంలో Unconditional love అనేది నూటికి 0.1% మాత్రమే ఉంటుంది.

పుస్తకాలనేవి మంచి చెడులు చెప్పడానికి ఉండవు. మంచి చెడులు మనకి మనమే విశ్లేషించుకునే నైపుణ్యాన్ని పెంచడానికి మాత్రమే ఉంటాయి. ఒక పాత్ర సృష్టిలో దాని సామాజిక నేపథ్యం, అది ప్రభావితం చేసే ఆలోచనా తీరు, దాన్ని బట్టి ఆ పాత్ర ప్రవర్తన, నిర్ణయాలు ఉంటాయి. అంతేగానీ, ఆ పాత్ర ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది కదా, అలా ప్రవర్తిస్తే ఈ కష్టాలు ఉండేవి కాదు కదా అని పాఠకులు చెప్పడం బానే ఉంటుంది. కానీ అది పాత్ర ఆత్మని అర్ధం చేసుకున్నట్టు కాదు. ప్రపంచంలోని ఇంత మంది మనుషుల్లో ఒక మనిషి పాత్రని తీసుకుని అల్లిన కధ ఇది. ఆ పాత్ర జీవితంలో ఉండే మార్పులకనుగుణంగా కథను ముందుకు తీసుకుపోయారు రచయిత. అంతేకానీ, దాన్ని ఆదర్శంగా తీసుకుని పాటించమని కాదు. ఉదాహరణకి ఎవరైనా రచయిత వేశ్యావాటికల్లో ఉండే ఒక మహిళ జీవితం గురించి రాయాలనుకుంటే అక్కడి వారి జీవితానికి, మనవాటికి సారూప్యత ఏ మాత్రం ఉండదు. ఆలోచనలు, వారి భాష కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. మనకి చాలా విపరీతంగా అనిపించినవి అక్కడ చాలా మామూలు విషయాలు. అక్కడ కూడా మనం మనకి చాలా తెలుసనేసుకుని మన అమూల్యమైన, విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం, ఆ పాత్ర వెనుక జరిగిన రీసెర్చ్ ని, దగ్గరగా చూసిన అనుభవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా. మనకి తెలిసిన, మనం ఆలోచనా విధానాలు మాత్రమే ఉన్న మనుషుల గురించే చదువుకుంటూ పోతే వేరేవి తెలిసే అవకాశమే ఉండదు.

నీల చిన్నప్పుడు అనుభవించిన కఠిన పేదరికం మనమెవ్వరం అనుభవించలేదు. రచయిత కూడా అనుభవించి ఉండరు. కానీ అది కళ్ళకు కట్టినట్టు రాయడం లోనే రచయితల నేర్పు కనబడుతుంది. నీల చోళదిబ్బకి తిరిగి వచ్చాక అక్కడి సమస్యలను, ఎదుగుదలనూ తను చదివిన సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంది. అలా దేన్నైనా ఎవరి దృష్టి కోణం నుంచి వారు చూస్తారు. మన ఆలోచనలు మారే కొద్దీ ఆ దృక్కోణం కూడా మారుతుంది. కానీ అప్పటికే ముందున్న దృక్కోణం వల్ల తీసుకున్న నిర్ణయాలవల్ల నష్టం జరిగితే కొన్ని సార్లు దాన్ని పూడ్చుకోలేం. అదే జీవితం మనకి నేర్పేది కూడా.

నీల వ్యక్తిత్వం గురించి, ఆ కారెక్టర్ elevation గురించి, పరదేశీతో సంభాషణ వల్ల కలిగిన మానసిక సంఘర్షణ, సంభాషణల్లోని భాష చదివితే పుస్తకం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ముందుముందు ఏం ఉంది అనే ఉత్సుకతని మొదటి నాలుగు పేజీలే క్రియేట్ చేయడం బావుంది.

ఆధునిక ప్రపంచాన్ని తెలుగులో వర్ణిస్తే చదవడం ఇదే మొదటిసారి. చాలా కొత్తగా ఉంది. కొంతమందిని ఊరికే అలా చూస్తూనే జీవితం మీద ఆశ ఎందుకు రెట్టింపవుతుంది, ఇది నాకే అనిపిస్తుందా, అందిరికీనా అనే సందిగ్ధానికి తెర తీసినట్టైంది. కొన్ని వాక్యాలు చదువుతుంటే చాలా ఫ్రెష్ గా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.”

అనేక చారిత్రక సంఘటనలు జరిగిన కాలంలో కూడా మనుష్యులు ఏవిధంగా ప్రవర్తించేవారు, ఆలోచించేవారు, పద్ధతులు ఎలా ఉండేవి అని చదివినప్పుడు ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేశారు, ఎక్కడ నుంచి చేశారు అనిపించింది.

మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని సంఘటనలను మనం అనుభూతించినంతగా వ్యక్తపరచడం తెలియదు. వాటికి చాలా చోట్ల అక్షరరూపం ఉందీ పుస్తకంలో.

నైతిక విషయాలు, విలువలు పోత పోసినట్టుగా ఒకే మూసలో ఉండవు. వాటిని మానవీయ కోణంలో చట్టపరిధిలోనే ఎవరికి వారు నిర్వచించుకోవాలి, దానికి వారి నేపథ్యం అసంకల్పితంగా పని చేస్తూ ఉంటుంది.

సంపూర్ణ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఎదిగిన తీరు అద్భుతం. అది జరిగిన తీరును చాలా సహజంగా తీసుకొచ్చారు. నిర్లక్ష్యం చేసిన శుభాంజలిని రాజకీయ అనామకురాలిని చేయడంలో, రత్నాకర్ ని కూడా మించిపోయి అతన్నే తన చుట్టూ తిప్పుకోవడం, వ్యక్తిగత జీవితాన్నీ, రాజకీయాన్ని వేరు చేసి చూడడంలో ఫక్తు రాజకీయ నాయకురాలి లక్షణాలు కనబడ్డాయి. పులి కడుపున పులే పుడుతుందని సంపూర్ణ పాత్ర చెబుతుంది. ఆమె పైకి వచ్చిన విధానంమీద ఉన్న అభ్యంతరాలుంటే ఉండచ్చు. కానీ విపరీతమైన డబ్బు, చదువు, కుల బలం ఉన్నవారిని రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే అవి ఏమీ లేని వారికి చాలా పరిమితమైన మార్గాలుంటాయి.

ఏ పాత్ర కూడా దాని ప్రభావం అందరికీ అర్ధమయ్యేంత conspicuous గా లేకపోయినా ఒక అంతర్వాహినిలా దాని ప్రాధాన్యం అది సంతరించుకుంది.

నీల ప్రతీ అడుగు, అనుభవించిన ప్రతీ క్షణం కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయేమో కొంతకాలం వరకూ. సదాశివ అంత ఉన్నతంగా ఉండడం ఎలా సాధ్యమో కొంత ఆశ్చర్యానికి గురి చేసినా ఎన్నో చదివి, ఎంతో మందిని చూసిన మనిషి తర్కానికి విలువిచ్చి, విశాలంగా ఆలోచిస్తే అది సాధ్యమే అనిపిస్తుంది.
ఒక కావ్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న తపనతో పోలిస్తే పేజీల సంఖ్య ఎక్కువేమీ కాదు. కల్పిత కధల్లో కనపడినట్టుగా కేవలం కధమాత్రమే రాసుకుపోకుండా ఆయా కాలాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో జరిగిన సంఘటనలు, పాత్రలమీద వాటి జీవితాలమీద వాటి ప్రభావం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా కాకుండా విపులంగా చెప్పడం అంకితభావానికి నిదర్శనం.

ఉత్తరాంధ్ర పండగలు, ఆచార వ్యవహారాలు తెలియనివారికి కొత్తగా, ఆహ్లాదంగా ఉంటుంది. తెలుగులో నాకు తెలియని పదాలు చాలా ఉన్నాయనిపించింది.

This is my sixth book in the series. ఇంతకు ముందు నేను ప్రస్తావించిన ఏ రచయితకీ తీసిపోని రచయిత మల్లీశ్వరి గారు. Observation of life, character and the changes in it over the period of life due to changes are outstanding. ఎక్కడా సీరియస్ నెస్ కోల్పోవడం కానీ, బద్ధకించడం గానీ లేకుండా శిల్పాన్ని చెక్కినట్టు చెక్కారు పుస్తకాన్ని. Thanks for giving us this beautiful book.

I need to confess something here. I borrowed this book from a friend. పుస్తకం కొన్ని పేజీలు చదివాక చెప్పేశాను తిరిగివ్వనని.

 

నీల నవల – అనిల్ డాని

Image may contain: Anil Dani, smiling, close-up

యువకవి, కవిసంగమం, కవితా పత్రికలో  కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ డాని నీల నవలపై చేసిన విమర్శనాత్మక సమీక్ష

****************************

నీల – ఎట్టకేలకి పూర్తి చేశా.  తానా బహుమతి పొందిన నవలలో ఒకటి నీల. కొంచం పెద్ద నవల – దాదాపు 500 పైగా పేజీలు. నీల అనే ఒక సాధారణ అమ్మాయి, ఏలూరు జూట్ మిల్లు కార్మికురాలి కూతురు. సాధారణంగా దిగువ మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి జీవితం, కుటుంబం అంటేనే ఒడిదుడుకులని మధ్యతరగతి పిల్లలకి ఓపికగా కూర్చొబెట్టి ఎవరూ చెప్పనక్కరలేదు జీవితమే అంతా నేర్పిస్తుంది. చాలీ చాలని అన్నం తాగుబోతు నాన్న , అమ్మది మరో కధ, అసలు నీల చుట్టురా కొన్ని వలయాలు ఉంటాయి వాటిని చాలా నేర్పుగా నీల ఎలా విడదీసుకుంది అనేది ఈ నవల చెప్పింది. చాలా ధైర్యవంతురాలు నీల , అలాంటి ధైర్యవంతురాలైన స్త్రీ పాత్రలు చాలా ఉంటాయి వాటిలో కొన్ని నిజ జీవితంలో మనకీ ఎదురౌతాయి. వాట్లిలో ఆరంజ్యోతి అనే పాత్ర చాలా ఉదాత్తమైనది , అలాగే సంపూర్ణ అనే పాత్ర చాలా క్లిష్టమైన పాత్ర అవసరం ఏమైనా చేయిస్తుంది అని చెప్పే పాత్ర , ఇంక నీల తల్లి చంద్రకళ కొంచం ఆసక్తి కలిగిస్తుంది, ఆమే తప్పు చేసిందా లేదా అనే విషయం రచయిత కూడా స్పష్టంగా చెప్పలేదు, కాని ఆ పాత్ర మీద చాలా సానుభూతి ఉంటుంది. ఇంక సరళ చాల విచిత్ర మనస్తత్వమైన పాత్ర ప్రసాద్ అనబడే ఒకానొకప్పటి నీల భర్త తో ఆమె సంబంధం అదే సమయంలో నీలతో తన ప్రవర్తన ఇలాంటివి కొన్ని ఆమె పాత్రని సూచిస్తాయి, అలాగే లాయర్ వసుంధర పాత్ర కూడా చర్చించుకోవాలి నీల కి అండగా నిబడడం లో చాలా ముఖ్య భూమిక ఆమెది .

 

ఇంక ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినది రెండు పాత్రలు ఒకటి. పరదేసి రెండోది సదాశివ , మొదటి వ్యక్తి ని నీల వద్దనుకుంటుంది , రెండొ వ్యక్తితో అతను అడగగానే సహజీవనానికి ఒప్పుకుంటుంది, ఇక్కడ మరో స్త్రీ మూర్తి “పాష్టరమ్మ” అనబడే పాత్ర ని గురించి మాట్లాడాలి ఆమె తన గురించి కన్నా నీల గురించే ఎక్కువ తాపత్రయ పడుతుంది, నీల సహజీవనం అనే సూత్రీకరణకీ తాను అస్సలు ఒప్పుకోదుకాని నీల ఒప్పిస్తుంది , సదా ఇంటి మనుషుల నడవడికని చూసి నీల ని సమర్దిస్తుంది. నీల ఒక సామాజికం గా జరిగిన మార్పులని ప్రస్తావిస్తూ సాగిన నవల , దళితుల జీవితాలు , అలాగే మత్స్యకారుల జీవితాలు అందులోని లోటుపాట్లు కొంచం విపులంగానే చెప్పారు రచయిత.

పెద్ద నవల కావడంతో లోపలికి పోవడానికి మనకి కొంత సమయం పడుతుంది , కాని వెళ్లిన తరవాత మరలా బయతకి రాబుద్ది కాదు ఆ పాత్రల మధ్యనే తిరుగుతూ ఉంటాం. కొంత నిడివి తగ్గినా బావుండేది అని కూడా అనిపిస్తుంది,కాని దాదాపు మూడు దశాబ్దాల స్తితిగతులని వర్ణించాలంటే రచయితకీ ఆ మాత్రం స్పేస్ ఉండాలేమొ అని కూడా అనిపిస్తుంది , అవడానికి నవల అయినా రచయితలోని కవయిత్రి చాలా సార్లూ బయటకి వచ్చి మనల్ని అబ్బుర పరుస్తుంది చాలా కవిత్వాన్ని అలవోకగా ఈ నవలలోకి ఒంపేశారు జాజిమల్లి గారు ఒక రకంగా అది నవలలోని మూడ్ ని ఆఫ్ కాకుండా చేస్తుంది ఉదాహరణలు ఇవ్వాలంటే మరలా ఇంకో నవల రాయాలి .

అంతా బాగానే ఉందా అంటే కొంత భాగం లేదనీ చెబుతాని నా మొదటి కంప్లైంట్ స్టాలిన్ సూర్యం పాత్రని అలా మధ్యలో వదిలేయడం నీల అతడినీ చివరివరకూ హీరోలానే చూస్తుంది. ఇంకపొతే ఆటోరాజు చంద్ర కళ మధ్యన బంధం ఎలా మొదలైందో అని పాఠకుడు కాస్త ఆలొచనలో పడతాడు , స్త్రీల మీద పాజిటీవ్ ఒపీనియన్ ఉన్నవాళ్లకి కొన్ని స్త్రీ పాత్రలు ఆలోచనని రేకెత్తిస్తాయి నీల కూడా కొన్ని సార్లు బేలగా మారుతుంది ముఖ్యంగా పరదేసీ పరిచయం అప్పుడు ఆమె పాత్ర ఎందుకో ఇంకా కొంచం బలంగా ఉంటే బావుండు అనిపించింది అలాగే వసుంధర గారి దగ్గర ఉన్నప్పుడు పరిచయం అయిన సదా వారిద్దరి అనుబంధం గురించి చెప్పినప్పుడు పరదేశి వద్ద చేసిన ఒప్పందం గురుతొచ్చి మరలా తనకి తాను పునరాలోచనలో పడుతుంది ఇది కొంత సంక్లిస్టమైన అంశం (పాఠకులకి చదివితేనే తెలుస్తుంది) ఇంక పూర్తిగా విస్మరింపబడిన పాత్ర “మినో” నీల కూతురు . నీల జీవితం అన్ని మలుపులు తిరుగుతున్నా కూతురి ప్రస్తావన చాల అతి తక్కువ సందర్భాల్లో వస్తుంది సాధారణంగా తల్లి హృదయం అలా ఆ పిల్లని చూస్తూ ఊరుకోలేదు కదా కాని మరెందుకో మినో ఆఖర్లో వచ్చి ఈ తరం ప్రతినిధిగా ఎదో కొంచం హడావుడి చేస్తుంది తప్ప మిగతా ఎక్కడా కనపడదు . కవర్ పేజీ కూడా ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బావుండు అనిపించింది.

 

ఏది ఏమైనా అసలు సాహిత్యమే లేదు ఇంకా నవలలు చదవడం ఎక్కడా అని వాదించే వారికి ఈ తానా బహుమతి నవలలు చూపించాలి ఎంత గొప్ప థీం తో ఎంపిక చేసారు ఇవి తప్పక చదవాల్సిన నవలలు చదివి సామాజిక మార్పుల గురించి చర్చించాల్సిన నవలలు రచయితలకి గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలి ఈ నవలల వలన అని ఆశిస్తూ .. రచయితలకి నా అభినందనలు