http://epaper.andhrajyothy.com/news?cat=sunday&day=20151025#26
వర్తమానకథల్ని చదవడమే తప్ప వాటిని ఆలోచనలలోకి తీసుకుని ఏవైనా రాయడం నాకు అలవాటు తప్పిపోయింది. కొద్దిగా ఆలస్యంగా మిత్రులు అఫ్సర్ ఇటీవల రాసిన కథ చదివాను. పుస్తకం పక్కన పడేసినా కథ నన్ను పట్టుకునే ఉంది. సమయానికి తగు కథ అయినందువల్ల ఇది నా ఆలోచనలని వదలకుండా పట్టుకుని ఉందా అన్న సందేహాన్ని ఈ నాలుగు రోజులుగా పోషిస్తూ వచ్చాను. కావొచ్చు . దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన పరమత అసహనాన్ని అడ్రెస్ చేస్తూ రాసిన కథ కదా అందరి దృష్టినీ తన వైపు లాక్కోవడం సహజం.
కానీ ఇందుకే కథలు ఆకర్షించగలవా! వస్తు కాల స్పృహ ఒకటే కథని రక్తి కట్టించగలదా? దానిని మించినది ఏదో ఈ కథలో ఉంది. నాలుగు రోజులుగా లోకాన్ని మరిపించి నన్ను తన అక్షరాల్లో కట్టేసుకున్న బుచ్చిబాబు ఏవంటున్నాడు! ‘ఉద్రేకంతో ఆవేశంతో అంతరంగ జగత్తులో ఒక కల్లోలం జరగాలి. ఆ కల్లోలం నిలిచిపోవాలి. అందులో మునిగి గుటకలు వేస్తూ మధ్య ఊపిరి తీసుకోడానికి పైకి లేచి బాహ్య జగత్తులోకి తొంగిచూడాలి’ బహుశా ఆ తొంగి చూపు లోనుంచేనేమో అఫ్సర్ కి అపూ దొరికింది. ఊహకి ఏకాంత యుద్ధాన్ని ఇచ్చి, ఎంత సేపు పోరాడి ఉంటాడో ఈ సైనికుడు చివరికి ఒక శాంతిదూతగా అపూని మన ముందు నిలబెట్టాడు.
అవును ఇందరు మేధావులు. కళాకారులు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు చిన్నబోతున్నారు నేలకొరుగుతున్నారు. దళసరి చర్మాలను కప్పుకున్న భద్ర జీవులం. మనకి అర్ధమయ్యేలా చెప్పడానికి ఈ కథకుడికి ఎంత యాతనో! ముల్లుని ముల్లుతోనే తీయాలనుకోలేదు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనుకోలేదు. ముళ్ళూ వజ్రాల కఠినత్వానికి ఎదురుగా పూవువంటి పసి హృదయాన్ని నిలబెట్టాడు. తనకి భిన్నంగా ఉన్నవాటిని అర్ధం చేసుకుని ప్రేమించే శక్తిని పసివాళ్ళే పొందగా లేనిది మనం సాధించాలేమా అని ప్రశ్నిస్తున్నాడు.
అపూగా మారిన నేను గర్వపడ్డాను. అపూ తల్లిగా మారి చైతన్యాన్ని పొందాను. అపూ తండ్రిగా నేను నిజానికి సిగ్గుతో చితికిపోవాలి. కానీ అఫ్సర్ గారూ నాకు నిస్సహాయంగా అనిపించింది. లోకం నిండా సురేష్ లే. ఎటు మెసిలితే అటు వారే. మన ఉద్యోగ స్థలాల్లో, వినోద స్థలాల్లో, మన మిత్రుల్లో, మన బంధువుల్లో కొత్త హడావిడి. కనీసపు కామన్ సెన్స్ తో నాలుగు మాటలు మాట్లాడితే వంద దాడులకి సిద్దపడి ఉండాలి. పట్నపురోడ్ల మీది బెదురుగొడ్డుల్లా మనది కాని చోటులో నివాసం ఉండటం ఎంత కష్టం. కానీ నిలువనీడ లేని చోట నిల్చున్న చోటనే పరిగెత్తాలి కదా. ఆ పరిశ్రమ నుంచి ఇలా నాలుగక్షరాలను పోగేద్దాం.
ఇక్కడ మన మాటలు అట్టడుగు స్వరాలు. నాభి నుంచి పెకలించాలి.
ఇక చమ్కీ పూల గుర్రపు గాలప్ హస్తిన వరకూ వినిపించాలి.