కనిమొళి కన్నీరు పెడితే…

భూమిక స్త్రీ వాద పత్రికలోలోగిలి’  శీర్షిక తో జనవరి నెల నుండి నేను రాస్తున్న కాలమ్
 
 మొదలైంది.www.bhumika.org  లో చదవవచ్చు.స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే
 
 సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక అంశాలను నా చుట్టూ ఆవరించిన జీవితాల్లోంచి
 
 చూసి నా అవగాహన కొద్దీ వ్యాఖ్యానించడం ఈ కాలమ్ ఉద్దేశం.
 
 
ఈ క్రమంలో భాగంగా మొదటగా కనిమొళి కన్నీరు పెడితే… అన్న అంశం మీద రాసాను. 

బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు

సదరన్ రీజనల్ లాంగ్వేజెస్ సెంటర్ (మైసూర్),తెలుగు శాఖ (కాకతీయ విశ్వ విద్యాలయం),ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ లో జనవరి 27 , 28 , 29 తేదీల్లో సమకాలీన స్త్రీల సాహిత్యం (1990 – 2010) అంశం మీద జాతీయ స్థాయి సెమినార్ జరగనున్నది.ప్రరవే ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మహాసభ ఇది.
 
ఈ సెమినార్ లో నేను బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు అన్న అంశం మీద పత్ర సమర్పణ చేస్తున్నాను. సాహిత్య సంబంధమైన విషయాలున్న స్త్రీల బ్లాగులు తెలియజేయగలరు.మీరు చెప్పే సమాచారం ద్వారా వ్యాసం సమగ్రంగా రావడానికి వీలుంటుంది..నవల,కధ,కవిత్వం,వ్యాసం,లేఖలు,దిన చర్య కధనాలు,జోకులు,ఇలాంటి అంశాలున్న బ్లాగుల్ని సూచించగలరు. తప్పనిసరిగా బ్లాగ్ కోసమే రాసిన అంశాలు ఉండాలి.  .ప్రింట్ లో వచ్చాక బ్లాగ్ లో పోస్ట్ చేసినవి కాకూడదు. బ్లాగ్ పేరు చెప్పినా లింక్ పంపినా malleswari.kn2008@gmail.com  కి గానీ,వ్యాఖ్యలలో గానీ తెలియ జేయగలరు.
 
నాకు తెలిసిన కొన్ని బ్లాగులు.
 
తెలుగు తూలిక
మనసులో మాట
వివాహ భోజనంబు
జాజిపూలు
కృష్ణప్రియ డైరీ
మా గోదావరి
తూర్పూ పడమర
గడ్డిపూలు
వెన్నెల సంతకం
తృష్ణ
మధురవాణి
నా స్పందన
జ్యోతి
sowmya writes
కొత్తావకాయ
రమ్యంగా కుటీరాన
alochanalu.wordpress
మడత పేజీ
 
ఇట్లా కొన్ని బ్లాగుల్ని పరిగణన లోకి తీసుకున్నాను .మరి కొన్నింటిని  బ్లాగు మిత్రులు సూచించగలరు.
 
(కృష్ణ ప్రియా సారీ….నీకిచ్చిన మాటని ఇట్లా నిలబెట్టుకోవాల్సి వస్తోంది.)
 
 

పిదప కాలపు పిట్ట కధలు

నా బ్లాగ్ లో నేను రాసిన జాజిమల్లి కతలు జాజిమల్లి  శీర్షికతో పుస్తకంగా వచ్చింది. పర్స్ పెక్టివ్స్ పుస్తక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. నా బ్లాగ్
 కథలకు రెగ్యులర్ పాఠకులు, విమర్శకులు, పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్య పేజి లో
 ప్రచురితమయ్యింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆ వ్యాసం ఇక్కడ…  .

ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

2008 స్వాతి అనిల్ అవార్డ్ పొందిన ‘జీవితానికో సాఫ్ట్ వేర్’ అను నా నవలని ఢిల్లీ  ఐ ఐ టి  ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్ అయిన కల్లూరి శ్యామల గారు ’software for life’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసారు.ఈ అనువాద నవలని  newaavakaaya.com  అంతర్జాల పత్రికలో 20 నవంబర్ నుంచీ మూడు ఆదివారాల పాటు ప్రచురించి తర్వాత e – book రూపంలో పాఠకులకి  అందుబాటులో ఉంచుతారు.
 
రచయిత పరిచయం లేకపోయినా కేవలం నవల పట్ల ఇష్టంతో అనువాదం చేసి నవలా వస్తువు ఎక్కువ మంది పాఠకులకి చేరాలని తపన పడే కల్లూరి శ్యామల గారికి,శ్యామల గారు సంప్రదించిన వెంటనే ప్రచురణకి తమ అంగీకారాన్ని తెలిపి వెంటనే ప్రచురించిన ఆవకాయ.కాం వారికి,ముఖ్యంగా కడప రఘోత్తమరావు  గారికి  నా ధన్యవాదాలు.
 
 

కారులో పడవప్రయాణం

ఉదయం ఆరు గంటల సమయం చాలా సార్లు చాలా అందంగా ఉత్సాహంగా ఉంటుంది…అయితే….నిన్న అది ఓ అపురూప ప్రయాణంలో సాహితీ పరిమళాలతో గుభాలించిపోయింది. ‘మా కొద్దీ తెల్లదొరతనం’ అంటూ జాతీయోద్యమ కాలానికి ఉద్యమ గేయాన్ని అందించిన గరిమెళ్ళ సత్యన్నారాయణ పుట్టిన వూరు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారం…నిన్న  అక్కడ ఉత్తరాంధ్ర కధకుల వర్క్ షాప్ మొదలైంది.విశాఖపట్నం నుంచి కాళీపట్నం రామారావు మాస్టారు అట్టాడ అప్పలనాయుడు గారు, నేను పొద్దున్నే ఆరింటికి బయల్దేరాం…
 
నేను ముందు సీట్లో కూచోడానికి వెళ్లబోతుంటే కారా మాస్టారు..”అప్పల నాయుడు నేనూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం నువ్వు వెనక సీట్లోకి వస్తే నీకు కధల గురించి బోల్డు సంగతులు చెపుతాను” అన్నారు…ఇక చూస్కోండి…కధల మాస్టారే పిలిచి మరీ ఇంత అదృష్టాన్ని పట్టించాక..ఆ ఉదయం ఎంత గొప్పగా మొదలైనట్టో!
 
”సత్యానికి నిజానికి తేడా ఏంటి?”ప్రశ్న తో మొదలు….నేను తీవ్రంగా ఆలోచనా ముద్ర అభినయించా…ఈ విషయంలో నాకు అవగాహన లేదన్ననిజం నాకు తెలుసు….కానీ ఒప్పుకోదుగా బుద్ధి…
అనేక ఉదాహరణలిచ్చాక అర్ధమైంది…సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ‘సత్యం’.అది ఎపుడూ జరిగేది…అతను దొంగతనం చేసాడన్నది ’నిజం’..ఇది ఆ క్షణానికి జరిగింది…
 
ద్రౌపది నవలకి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చినపుడు కారా మాస్టారి మీద వచ్చిన విమర్శలు,వాస్తవాలు మొదలు….విరసంతో విభేదాలు…యజ్ఞం కధ నేపధ్యం, కొడవటిగంటి కుటుంబరావు తో పరిచయం  రావిశాస్త్రితో స్నేహం…. ఎనభై ఏడేళ్ళ కారా మాస్టారు తన జీవితాన్ని తడుముకుంటున్న ఆ క్షణాల్లో ఎందరు సాహిత్య కారులు!! యుగకర్తలు!! వారందరి మధ్యా నేనూ నిలబడి అన్నీ గమనించనట్టు తోచింది… 
 
కొకు,రావిశాస్త్రిల సాహిత్యం గురించి మాట్లాడుతూ రావిశాస్త్రి రచనలు తాజ్ మహల్ లా విభ్రమ కలిగిస్తే కొకు రచనలు ఆనకట్టల్లా జీవితానికి ఉపయోగపడతాయి.’అన్నారు.
 
 ’పంచేంద్రియాలని స్పృశించే కధ రాయడం వొక టెక్నిక్…ఈ సారి ఆ రకం గా వొక కధ…ప్రయోగం కోసమైనా రాయి”అంటూ నాకు వొక సూచన చేసి..ఆ రకమైన టెక్నిక్ వాడిన కధగా పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం కధని కారులోనే చదివించేసి…ఆ కధని విశ్లేషించి చెప్పారు…
 
14 గంటల పాటు మాస్తారితో  పూర్తి సాహిత్య చర్చలతోనే గడపడం చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది…విచిత్రం…మాస్టారు…మాస్టారులా బోధించలేదు..మిత్రుడిలాగా పంచుకున్నారు…
 
కధక మిత్రులారా…
కధా నిర్మాణం గురించి మాస్టారు చెప్పిన ఈ సూచన మీకూ ఉపయోగపడుతుందేమో…చూడండి..
కధలో  పాత్రల మధ్య సంభాషణలని ఎపుడు పడితే అపుడు ప్రతి చిన్న విషయానికీ వాడకూడదు..భావోద్వేగాలను వ్యక్తం చేసే సందర్భాల్లో మాత్రమే వాడాలి.

వార్తలో నా కధ – టెంకి జెల్ల

అక్టోబర్ రెండవ తారీఖున వార్త ఆదివారం అనుబంధం లో ప్రచురితమైన టెంకి జెల్ల కధ,

ఒక రాజకీయ వ్యంగ్య కధగా నేను చేసిన తొలి ప్రయోగం.




జాజిమల్లి కతలకి ఇక వీడ్కోలు.

ప్రింట్ లో వచ్చిన బ్లాగ్ సాహిత్యం  గురించి  సమాచారం ఏవైనా ఉంటే  బ్లాగ్మిత్రులు తెలియజేయగలరు.నాకు తెలిసీ తెలుగుతూలిక బ్లాగర్ మాలతి గారి బ్లాగ్
 
 
సాహిత్యం పుస్తకరూపంలో వచ్చింది.తూర్పుపడమర బ్లాగర్ కల్పన గారి తన్హాయి నవల ప్రింట్ లో వస్తున్నట్టు తెలుసు…ఇవి కాకుండా కేవలం బ్లాగ్ లోనే
 
 
ప్రచురింపబడిన సాహిత్యాన్ని ప్రింట్ లోకి తీసుకువచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు.
 
 
జాజిమల్లి కతల శీర్షికన నేను రాసిన 40  కతలతో  ప్రింట్ లో సంకలనం తీసుకుని వస్తున్నాను.ఇవి నేను కేవలం బ్లాగ్ లోనే రాసాను. నా మాటలు
 
 
రాసుకునేపుడు ప్రింట్ లో వచ్చిన బ్లాగ్ సాహిత్య ప్రస్తావన చేయడం అవసరం అనుకుంటున్నాను.
 
 
 
ఇక జాజిమల్లి కతలకి శాశ్వతం గానూ,జాజిమల్లికి తాత్కాలికంగానూ వీడ్కోలు….
 
 
ఇన్నాళ్ళూ ఈ కతల్ని ఇష్టపడిన బ్లాగ్మిత్రుల సహకారానికి కృతజ్ఞతలు.

వసీరా…మళ్ళీ ఇలాంటి కవిత్వం రాయరూ

ఈ ఆదివారం ఇంత గొప్పగా మొదలవుతుందనుకోలేదు.

పొద్దున్నే బద్దకం కాకుండా నరనరాల్లో ఇలా ఉరవళ్ళు తొక్కుతున్నదేంటి?

సంతోషమా,దుఃఖమా,ప్రేమా,తపనా,

పరిసరాల్లో ఇలా  పరవళ్ళు తీస్తున్నదేంటి?

ఇష్టమా,అద్భుతమా,మైమరుపా,సంతృప్తా

ఇది వసీరా కవిత్వం కాక మరేంటి?

వసీరా కవిత  ‘ దుఃఖం ‘

ఎంత మందిని జయించిందో ఏమో

మా చెడ్డ గర్వంగా నా మీదకి లంఘిస్తుంది దుఃఖం

సాచి లెంపకాయ కొడతాను

కళ్ళు తిరిగి నా కాళ్ళ దగ్గర కూలబడుతుంది

దుఃఖం భుజాలు పట్టుకు లేవనెత్తి

కళ్ళలోకి చూసి నవ్వుతాను

అసలే ఉడుకుమోతు

అందుకని దుఃఖం ఒళ్లంతా కితకితలు పెడతాను

అపుడు తడికళ్ళతో పకపకా నవ్వుతుంది

నేనూ దుఖమూ చెట్టాపట్టాలేసుకుని

హోటల్ కి పోయి టీ తాగుతాం

ఒకళ్ళమీదొకళ్ళు జోకులేసుకుంటాం

దుఃఖానికి వీడ్కోలు చెప్తూ అంటాను

మళ్ళీ ప్రయత్నించకేం

నువ్వే ఓడిపోతావు

కానీ సాటివాళ్ళు కష్టాల్లో ఉన్నపుడు

నేను మనిషినని గుర్తు చేయడానికి

తప్పనిసరిగా నా దగ్గరికి రా

నన్ను సాచి లెంపకాయ కొట్టి మనిషిని చెయ్యి

(1984)

(లోహనది కవితా సంపుటి)

విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై ఆ.సౌమ్య అభిప్రాయాలు

విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై తన స్పందనని తెలియజేసిన ‘వివాహ భోజనంబు’(మాయా శశిరేఖ)

బ్లాగర్  ఆ.సౌమ్య గారికి కృతజ్ఞతలు 

 

1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 

 నేడు ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాహిత్యం లోనూ మార్పులు వస్తూ, ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 20వ శతాబ్దంలో సాహిత్య స్వరూప స్వభావాల్లో గణనీయమైన మార్పులు రావడం ప్రారంభమయింది. ప్రాచీన సాంప్రదాయ శైలిని దాటి ఆధునిక, అభ్యుదయ, అత్యాధునిక(పొస్త్ మొదెర్న్) విప్లవం, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం ప్రాంతీయ అస్తిత్వవాదాలుగా మార్పుచెందింది. అంతేకాక దేశంలో వస్తున్న ఆర్థిక, రాజకీయ సామాజిక మార్పులను కూడా కలుపుకుంటూ సాహిత్యం ముందుకు నడుస్తొనది. భాష కూడా ఒక వర్గనికి మాత్రమే అర్థమయ్యే స్థాయి నుండి వ్యవహారిక శైలిని సంతరించుకుని సామాన్య ప్రజలకు చేరువయింది. రచనా వస్తువు, శిల్పం కూడా కాలానికనుగుణంగా ఎన్నదగిన మార్పుచెందింది. రచనకి సామాజిక ప్రయోజనం ఉంది అనుకుంటే ఈ మార్పు సహజమైనది,శుభసూచకమైనది కూడాను.

2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

 

విప్లవ, అస్థిత్వ వాదాలు, ప్రాంతీయ వాదాలు అనేవి సాహిత్యంలో ఒక భాగంలా ఉండాలి కానీ తమ ఆధిపత్యం ప్రకటించుకునే దిశలో ఉండకూడదు. కానీ ఈ సాహిత్యాలలో చాలామేరకు ఆధిపత్య నిరూపణ, ‘మేము ఒక వర్గం’ అని నిరూపించుకోవాలనే దిశలో ముందుకెళ్తున్నట్టు తోస్తున్నాయి. ఆ క్రమములో ఘర్షణల స్థాయి పెరుగుతున్నదని నా అభిప్రాయం. స్వేచ, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమాలలో కొంత ఆవేశం ఉండడం సహజం. ఆ ఆవేశాన్ని కయ్యానికి కాకుండా పట్టుదలగా మార్చుకునే పద్ధతిని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 

 నాకు అంత అవగాహన లేదు.

 4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ

ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 

 విప్లవ సాహిత్యోద్యమం ఎదిగినంతగా అస్తిత్వ ఉద్యమాలు ఎదగలేదు. వాటికి రావలసిన ప్రాముఖ్యత, గుర్తింపు ఇంకా రాలేదు. ఉద్యమ చైతన్యం ఉన్నవారు, ఆ వర్గంలో ఉన్నవారు, మరికొందరు తప్ప ఈ ఉద్యమాలపై చిన్నచూపు చూసేవారే ఎక్కువ. ఈ దశలో సొంత సాహిత్య విమర్శ అభివృద్ది చేసుకోవడం కష్టతరం. అది జరగలేదు.

 5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో,

విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

 

 నాకు అంత అవగాహన లేదు.

 6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 

 ఇతర భాషాసాహిత్యాలతో పోలిస్తే ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రభావం సామాన్య ప్రజలపై అనుకున్న స్థాయి లో లేదు. అందునా అస్తిత్వ ఉద్యామాలపై అవగాహన, వాటి ప్రభావం ఇంకా తక్కువ. ఉజ్జ్వల దశ అన్నది చాలా పెద్ద మాట….ప్రాచీన సాహిత్యనికి వచ్చినంత గుర్తింపు విప్లవ అస్తిత్వ ఉద్యమాలకి ఇంకా రాలేదు. ఈ విషయంలో అస్తిత్వ సాహిత్యం కన్నా విప్లవ సాహిత్యం కొంత మెరుగుగా ఉన్న విషయం వాస్తవం. విప్లవ సాహిత్యోద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్ళగలిగే కొన్ని మధ్యమాలు ఉన్నాయి. కొంత రాజకీయ సహకారం కూడా లభిస్తోంది. కానీ అస్తిత్వ ఉద్యమాలు ఇంకా బాల్య దశలోనే ఉన్నాయి. వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళగలిగే మాధ్యమాలు లేవు. అస్తిత్వ ఉద్యమల గురించి అవగాహనే చాలా తక్కువమందికి ఉంది. ఈ ఉద్యమాలు ఇంకా ఎంతో ఎదగాల్సి ఉంది.

7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం

రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

 

విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే ప్రగతి శీల దృక్పధం “మానవతావాదం”. వ్యక్తివాదం, వర్గవాదం స్థాయినుండి మానవతావాదం రచనలకు ప్రాతిపదిక అయ్యే స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో మానవతావదమే ధ్యేయంగా సాహిత్యరచన కొనసాగుతందని ఆశిస్తున్నాను.