అనుభూతుల వనంలో వలిసె పూల వాన

ఈ రోజు సెలవే కదా
 సూర్యుడు హాయిగా మంచు దుప్పటి కప్పుకుని
వెచ్చగా పడుకోవచ్చుగా
ఏదో పనున్నట్లు హడావిడిగా ఆకాశ వీధిలోకి
పాక్కుంటూ వచ్చి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు.
అంతే ….
లోయల వంపుల్లోను,చెట్ల గుబురుల్లోను
సెలయేటి అలల మీద,పిట్టల రెక్కల మీద
బంగారు మిలమిలలు

ఈ రోజు అచ్చంగా హృదయానికే అంకితం చెయ్యాలని
ఓసారి తొంగి చూడగానే
మొన్నెపుడో కురిసిన వలిసె పూల వానకి
రాలిపడ్డ అనుభూతుల గుత్తులు కనిపించాయి

పదమూడేళ్ళుగా  ఓ పసితనానికి ఆటవస్తువయి 
యవ్వన  ప్రవేశపు అలజడి తో దూరంగా
తొలగిపోతున్న కూతురిని చూసి
బెంగటిల్లె తండ్రిలా మారింది మనసు
అరకును వదిలి వచ్చేస్తుంటే

క్లాసు రూంలో పులిహోర పంచిన లెక్చరర్

క్లాసు రూంలో పులిహోర పంచిన లెక్చరర్ ..

నేనిపుడు రాస్తున్న విషయం మీలో చాల మందికి తెలియక పోవచ్చు.కొంత తెలిసినా సవాలక్ష సమస్యలలో ఇదీ ఒకటిగా అన్పించొచ్చు కానీ ఇది తరువాతి తరాల మీద చూపే ప్రభావం తక్కువ కాదు.విశ్వ విద్యాలయాల అనుబంధ కళాశాలల్లో పని చేస్తున్న లెక్చరర్ల పట్ల యాజమాన్యాలు చూపించే నిరంకుశ ధోరణి చూస్తే బతకలేక బడి పంతులు అన్న మాట వాస్తవం అన్పిస్తుంది.మచ్చుకు ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను .ప్రతి కాలేజీ లో జూన్ నుంచి డిసెంబర్ లోపు సిలబస్ అయిపోవాలి .తరువాత ఆరు నెలలు జీతం ఇవ్వడం అనవసరం కనుక అవసరం లేని లెక్చరర్లని జాబ్ లోంచి తొలగించడానికి సకల ప్రయత్నాలు ప్రారంభిస్తారు.యాజమాన్యాలు ఈ విషయం లో గొప్ప సృజనశీలురు.ఇట్లా కనిపెట్టిందే ఒపీనియన్ పోల్ .ఈ మాట వినగానే లెక్చరర్ల గుండెలు దడదడలాడతాయి.విద్యార్ధుల చేతికి పగ్గాలు వస్తాయి.అవును మరి ఇక్కడ విద్యార్ధుల అభిప్రాయాలే లెక్చరర్ల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. లెక్చరర్ల టీచింగ్ ఎబిలిటీస్ తో సహా వారి ప్రవర్తన ,ఉపయోగం మొదలైనవన్నీ ఎక్సలెంట్ ,వెరీగుడ్, గుడ్,యావరేజ్,బిలో యావరేజ్ ,పూర్ కాటగిరీలలో విద్యార్ధులు లెక్చరర్ల సామర్ధ్యాన్ని నిర్ణయిస్తారు. ఒపీనియన్ పోల్ కి ముందు తెలీక విద్యార్ధుల్ని మందలిస్తేనో వాళ్ళని ఆకట్టుకునేలా పొరపాటున పాఠం చెప్పలేకపోతెనో ఇక అంతే.డిసెంబర్ లో లెక్చరర్ల పాట్లు అనీ ఇన్నీ కావు విద్యార్ధి దేవుళ్ళ ముందు ఈ రోజు ఉపాధ్యాయులు చేతులు మోడ్చి నిల్చున్న భక్తులు.భక్తులు దేవుళ్ళకు కానుకలు సమర్పించుకోవాలి కదా అందుకే ఈ మధ్య ఒపీనియన్ పోల్ జరుగుతుందని తెలిసిన ఓ లేడీ లెక్చరర్ ఓ అడుగు ముందుకేసి 60 మంది విద్యార్ధులున్నక్లాసుకి ఓ పెద్ద డబ్బా నిండా పులిహోర పట్టుకొచ్చి చాటుగా పంచుతూ కొంత మందికి దొరికిపోయింది.మనుషులని ఇట్లా తయారు చేసేదేమిటో తెలిసాక అమెకేమని నీతి సూత్రాలు బోధించాలి?

స్త్రీలకు ప్రయాణం –పెత్తనం కథల సంపుటి నుండి

స్త్రీలకు ప్రయాణం

                కెయన్ మల్లీశ్వరి

          నాకు అతనంటే ఎంతిష్టమో .. ఎంచగ్గా నవ్వుతాడో !! వెన్నెల పింజలు పింజలుగా రాలుతున్నట్లు వుంటుంది. ఎంత ప్రేమగా చూస్తాడో !! కాంతి వానలో నిండారా తడుస్తున్నట్లు వుంటుంది. ఎలా స్పర్శిస్తాడో !! మత్తెక్కించే అడవిపూల పరిమళం బరువుగా చుట్టుముట్టినట్లు వుంటుంది.

          సుమ తదేకంగా మనోహర్ వంకే చూస్తోంది. నిద్రలో అమాయకంగా పసిపిల్లాడిలా కనిపిస్తోన్న అతన్ని మరీమరీ చూడాలనిపిస్తోంది

          చూస్తున్న కొద్దీ అనందంతో, ప్రేమతో, అల్లరితనంతో నవ్వు వుబికి వుబికి వస్తోంది. మనోహర్ కి చెరోవైపు పడుకున్న బాబూ , పాప అతని మీద కాళ్ళూ, చేతులూ యిష్టం వచ్చినట్లు పడేసి నిద్రపోతున్నారు. భూభారాన్ని ఎంతో సహనంతో భరించే భూమాతలా నిద్రలోనూ పెదాల వంపులో చిందులేస్తున్న నవ్వుతో ఆనందంగా పడుకున్నాడు మనోహర్.

        అనురాగంతో అతని నుదుటిని చుంబించింది.

          మెలకువ వచ్చింది మనోహర్ కి . కళ్ళు విప్పాడు……… ఎదురుగా సుమ …………అతని కళ్ళు నవ్వాయి. పెదాలు విడివడ్డాయి.

          “ఇంకాసేపు పడుకోరాదూ ! ………..” అన్నాడు.

          “అయిదున్నరయింది………” అతని నుదిటి మీద జీరాడుతున్న వెంట్రుకల్ని పైకి తోస్తూ అంది.

          “వూ …………”అంటూ తన మీద పడున్న పిల్లల కాళ్ళూ చేతుల్ని మెల్లగా తప్పించి లేచాడు.

          ఇద్దరూ కలిసి వంట చేసుకుంటుండగా హఠాత్తుగా సుమకి ఓ విషయం గుర్తొచ్చింది… నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి బస్టాప్ కి నడిచి వస్తుండగా తన కొలీగ్ అడిగిన ప్రశ్న ………..” మీ వారిని చాలా సార్లు చూసాను……….. మాట్లాడాను … మీరంటే ఆయనకి అంతులేని ప్రేమవున్నట్లుగా అన్పిస్తోంది . అసలు మీరంటే ఆయనకి ఎందుకంత యిష్టం ?…………”అంది.

          తనకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. నవ్వేసి వూరుకుంది………….అవునూ ………మనోహర్ కి తనంటే ఎందుకిష్టం ??………………. తలతిప్పి అతని వంక చూసింది……………. చాలా ఏకాగ్రతతో కారెట్ ని కట్ చేస్తున్నాడతను………………. ముచ్చట పడుతూనే.

          “మనూ! …………నేనంటే నీకెందుకు యిష్టం?…………….. అడిగేసింది సుమ. తల తిప్పకుండానే ముసిముసి నవ్వులు రువ్వాడు. చేస్తున్న పని వదిలేసి వచ్చి “చెప్పవా?” గారంగా అడిగింది.

          అప్పుడు తల తిప్పి అత్మీయంగా ఆమె వంక చూశాడు.

          “ప్లీజ్ ……”బతిమిలాడుతున్న స్వరంతో అడిగింది సుమ . జవాబు చెప్పడానికి అతనేం సంకోచించలేదు. ఆలోచించలేదు………..చాలా స్పష్టమయిన కంఠంతో……..

          ” నీవ్యక్తిత్వం అంటే యిష్టం నాకు…………నువ్వు నన్ను నగలూ, బట్టలూ కొనిచ్చేవాడిలా చూడలేదు………. ‘నన్నూ , పిల్లల్నీ , నువ్వే పొషించూ’ అనలేదు. మన అనుబంధం పట్ల చాలా శ్రద్ధగా వుంటావు…………… కుటుంబాన్ని నడిపే బాధ్యత  నాదొక్కడిదే అని నువ్వెప్పుడూ భావించలేదు. మనిద్దరిలో ఎక్కువ తక్కువలు లేవన్న ఙ్ఞానాన్ని నీ సాహచర్యంలోనే నేర్చుకున్నాను……… అంతెందుకు నువ్వు నీలా వుంటావు………… నన్ను నాలా వుండనిస్తావు.అందుకే నువ్వంటే యిష్టం …….” చెప్పాడు.

          చిరునవ్వుతో మొహం వికసించగా మళ్ళీ పనిలో పడింది సుమ. ఎనిమిదిన్నర కల్లా తయారయి ఆఫీసుకి బయలుదేరింది . హాలు దాటుతుండగా టీపాయ్ మీదున్న శుభలేఖ ఆమెని ఆకర్షించింది.

          అంత అందంగా వుంది ఆ కార్డు………….. అది చేతిలోకి తీసుకుని చూస్తుండగా మనోహర్ వచ్చాడు. నా బెస్ట్ ఫ్రెండ్ మధు మారేజ్ కార్డ్ అది…………….నిన్న ఆఫీసుకి వచ్చింది….. వాడు వుద్యోగంలో డెవలప్ మెంట్ కోసం ఆ దేశం , ఈ దేశం తిరుగుతూ ముప్ఫయి మూడేళ్ళు వచ్చే వరకూ పెళ్ళి ప్రయత్నం చేయలేదు. యిదిగో యిప్పుడు ఆసక్తి కలిగినట్లుంది……….రోజూ ఫోన్ చేసి చెపుతూనే వున్నాడు. రెండురోజులు ముందే రమ్మని……….. నీకు సెలవు దొరుకుతుందా ? వెళ్దామా? ” అడిగాడు.

          “వూ ! …………ఎక్కడా పెళ్లి ? ……….. ఆసక్తిగా అడిగింది.

          “మా పెద్దమ్మ గారి వూళ్ళోనే…. ఏలూరు దగ్గర వట్లూరులో……………” చెప్పాడు.

          సుమ పెళ్ళి కార్డుని ఓపెన్ చెయ్యగానే అందులోంచి గులాబీ పువ్వు రంగులో , అదే షేప్ లో వున్న పేపర్ కింద పడింది.

          సుమ సంభ్రంగా తీసి చూసింది………అందులోంచి’ స్త్రీలకు ప్రయాణం ‘అన్న అక్షరాలు కన్పించాయి.

          “ఇదేంటి ?……….. ఆశ్చర్యంగా అడిగింది.

          “నీకు తెలీదా …………. ఆ కార్డు లేకపోతే ……” అంటూ ఏదో అనబోయి గబుక్కున మాటలు మింగేసి తడబడ్డాడు.

          వింతగా చూసింది సుమ . ఆమె పుట్టడం, పెరగడం అంతా వైజాగ్ లోనే. మనోహర్ ది విజయవాడ. చదువు నిమిత్తం ఆంధ్రా యూనివర్శిటీ లో చేరి అక్కడ పరిచయయిన సుమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . యిద్దరి కులాలు వేరు…. ఆహారపు అలవాట్లు వేరు. ఆచార సంప్రదాయాలు వేరు…..ఈ భిన్నత్వం తమ జీవితం మీద ఏ ప్రభావం చూపించకుండా వుండటానికి ముందే మనస్సు విప్పి మాట్లాడుకున్నారు. యిద్దరి మనసులూ నొప్పించని ఆచారాలని పాటించాలి. అంతే! యిప్పటి వరకూ ఏ పొరపొచ్చాలు లేకుండా జీవితం పూలనావలా సాగిపోతోంది.

          “ఏయ్  ! మనూ ……..చెప్పు ……….యిలా ఎందుకు రాసారు …..? కార్డ్ మగవాళ్ల పేరున వేస్తారు కదా !…………ఆడవాళ్ళు బాధపడతారని యిలా వేశారా ?………..నేనెపుడూ యిలాంటి కార్డులను చూడలేదు ……ఆడవాళ్ళని యిలా గౌరవించే వాళ్ళూ వుంటారా?” సుమ అంటుంటే మనోహర్ తల అటూ ఇటూ కాకుండా వూపేసాడు.

          “ఈ పెళ్లి కి నేనూ తప్పకుండా వస్తాను………..” డిక్లేర్ చేసింది సుమ……

          రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఏలూరు చేరుకున్నారు సుమ, మనోహర్ , పిల్లలు. మధు స్టేషన్ కి కారు పంపించాడు. ఆమె ఏలూరు ఎపుడూ రాలేదు. అందుకే వట్లూరు వచ్చేటప్పుడు తను డిగ్రీ చదివిన సి.ఆర్.రెడ్డి కాలేజీని సుమకీ పిల్లలకీ చూపించాడు మనోహర్. నాన్న చదివిన కాలేజ్ చూడటానికి విండొ సీట్ కోసం పోటీ పడ్డారు బాబు, పాప.

          ఊరి చివరి రైసుమిల్లు దగ్గర మనోహర్ పెద్దమ్మగారిల్ల్లు…..ఆవిడ యిద్దరు కొడుకులూ అమెరికాలో సెటిలయ్యారు.ఆమె , ఆమె భర్త యిద్దరే వుంటారు. పెద్ద మండువా లోగిలి యిల్లు. చుట్టూ పొలాలు………. వాటి మీద ఎగురుతున్నకొంగలు.ప్రాణం లేచి వచ్చింది సుమకి. మనోహర్ పెద్దమ్మ శాంతమ్మ సుమని ఆప్యాయంగా పలకరించింది.

          మర్నాటి వుదయం పిల్లలు పొలంలో వున్న బోరు దగ్గర నీళ్ల కుండీలో స్నానం చెయ్యాలని వుబలాటపడ్డారు. సుమకి కూడా వుత్సహంగా అన్పించింది. నలుగురూ కలిసి పాలేరుని వెంట పెట్టుకుని శాంతమ్మకి చెప్పి బయల్దేరుతుంటే  “నువ్వొద్దులేమ్మా!…..” యధాలాపంగా సుమతో అందామె.

          “ఏం అత్తయ్య ?………… “తెల్లబోతూ అంది సుమ.

          “మనవైపు ఆడాళ్ళు పొలాలకి వెళ్ళరు . ఎవరికన్నా తెలిస్తే నవ్వుతారు . మనూ నువ్వు వెళ్ళరా !…” అందామె

          మొహం ఎర్రబడింది సుమకి. పొలం వెళ్ళడం తప్పా?మనోహర్ వైపు చూసింది. మనోహర్ కి ఏం చెప్పాలో తోచలేదు. పాలేరుని పిల్లల్ని తీసుకుని వెళ్లమని చెప్పి మనోహర్ ఆగిపోయాడు.

          ఈ సారి ఆశ్చర్యపడటం శాంతమ్మ వంతయ్యింది. సుమ ఎందుకు డల్ అయిందో అర్థం కాలేదు.ఆ అమ్మాయి మంచి కోసమేగా తను చెప్పింది అనుకుని సుమ వెంట వెంటే తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పి నవ్విస్తూ సుమని మామూలు స్థితికి తెచ్చింది.

          మనోహర్ మధుని కలిసి వస్తానని వెళ్ళాడు. పెళ్ళి రాత్రికే !… పెళ్ళికూతురిదీ ఈ వూరే !… అందుకే పెళ్ళికి యింకేవూరు వెళ్ళాల్సిన అవసరంలేదు.

          సుమ , శాంతమ్మ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఓ యాభై ఏళ్ళ వ్యక్తి వచ్చి వాకిట్లోంచే ” శాంతమ్మగారూ !………………. పిలిచాడు.

‘ ఆఁ ‘ లోపలి నుంచే పలికిందామె.

          “ధనకోటేశ్వరరావు గారి అబ్బాయి మధుబాబు పెళ్ళి సందర్భంగా ఈ పొద్దున్న మగోరికి భోజనాలు……… తప్పకుండా రావాలి …………..” పాఠం చదివినట్లుగా చెప్పి వెళ్లిపోయాడు.

          నిర్ఘాంతపోయి వింది సుమ.. “మగవాళ్ళకి భోజనాలేంటి?……………….” అర్థంకానట్లు అడిగింది.

          “పెళ్ళి రాత్రికిగా! ఓ పూట ….వూళ్ళో ముఖ్యమైన యిళ్ళలో మగవాళ్ళకి భోజనాలు పెడతారు. మీమావయ్య ,మనూ,బాబు వెళతారు . నీకూ, నాకూ, పాపకి వంట చేస్తాలే ……” అని శాంతమ్మ అంటుంటే అయోమయంగా చూసింది.

          తమ పెళ్ళయిన యిన్నేళ్ళలో మొదటిసారిగా తమ కుటుంబంలో ఓ విషయంలో యిద్దరికి అర్హత వుండటం, మరో యిద్దరికి అర్హత లేకపోవడం చూస్తోంది.

          “ఆడవాళ్ళని ఎందుకు పిలవరు …………?” అసంకల్పితంగా అడిగింది…………..

          “ఊరంతా భోజనాలు పెట్టలేరు ! అదీకాక కుటుంబపెద్దనీ, అతని వారసుల్నీ అందరూ గౌరవించాలి కదమ్మా!……అంది శాంతమ్మ.

          మనసు మెలిపెట్టినట్లయింది సుమకి. “అలా పిలవలేనపుడు బాగా ముఖ్యులనుకున్న పది పదిహేను కుటుంబాలలో అందరినీ పిలుచుకోవచ్చుగా !………. అంది సుమ.

          పదునుగా వున్న ఆమె కంఠ స్వరం విని నివ్వెరపోయింది శాంతమ్మ . సుమ భావాలు ఆమెకి అర్థంకాలేదు….

          దిగులుగా కూర్చుంది సుమ………కాసేపటికి మనోహర్ వచ్చాడు.అతనికీ తనకీ మధ్య ఏదో దూరం ఏర్పడినట్లు వుంది…….

          “మధు వాళ్ళింట్లో మొగాళ్ళకి భోజనాల్రా, మీరు వెళతారుగా!…………….” అంది శాంతమ్మ.

          మనోహర్ మొహం చిన్నబోయింది. తనని పట్టుకుని వుయ్యాల వూగుతున్న పాపని గుండెలకి హత్తుకుని సుమ వంక ఆర్తిగా చూస్తూ.

          “ఊహూ! ………….యిక్కడే చేస్తాను ………….రాత్రకి అందరం కలిసి వెళతాం………….” చెప్పాడు.

          కొంచెం మనసు తేలిక పడింది సుమకి. పడుకుని లేచి మధు వాళ్ళింటికి వెళుతూ సాయంత్రం ఏడింటికల్ల రెడీగావుండమని చెప్పాడు.

          మనోహర్ అటు వెళ్లగానే “ఆ ! ……….. ఏడని చెపుతారుగానీ మగాళ్ళ బంతులు అయ్యెసరికి తొమ్మిది దాటుతుంది. నువ్వు ఎనిమిదిన్నరకి వెళితే సరిపోతుందిలే అంది.

          “మగాళ్ళ బంతులేంటి ?……… “మళ్ళీ ఏం వినాల్సి వస్తుందోనని బితుకుబితుకుమంటూనే అడిగింది.

          “ముందు మాగాళ్ళ భోజనాలు అయ్యాకే ఆడాళ్ళకి భోజనాలు పెడతారు………”

          “ఎందుకలా?” సుమ అడిగింది.

          “ఎందుకేంటి ? మగాళ్ల తిన్నాకే కదా ఆడాళ్ళు తినాలి” అందామె.

          కళ్లప్పగించి చూసింది సుమ. ఆమెకి తను ఎంత అఙ్ఞానంలో వుందో అర్థమయింది. తను బాగున్నట్లే లోకం అంతా బావుందని అనుకుంది. వుహూ…… లోకంలో అంతా సుఖంగా లేరు. మరీ ముఖ్యంగా ఆడాళ్ళు గౌరవంగా జీవించడం లేదు.

          సాయంత్రం ఆరు వరకూ అన్యమస్కంగానే గడిపి స్నానం చేసి తయారయి….. శాంతమ్మ దగ్గరకి వచ్చి “మీరూ రెడీ అవండి………”అంది సుమ.

          “మాకు స్త్రీలకి ప్రయాణం లేదమ్మ ! నేనురాను మీ మావయ్య వస్తారు……” అందామె.

          సుమకి తను చూసిన శుభలేఖ అందులోని ‘స్రీలకి ప్రయాణం ‘కార్డు గుర్తొచ్చింది . ఏదో లింక్ అందుతోంది. మనసులో అనుమానం సుళ్ళు తిరుగుతోంది.

          “అలా ఎందుకు రాస్తారు ?…………..” అడిగింది సుమ.

          ” ‘స్త్రీలకి ప్రయాణం’  అని వుంటేనే ఆడవాళ్ళు పెళ్లికి వెళ్లాలి………లేకపోతే కేవలం మగాళ్ళే వెళ్ళాలి……………..” చెప్పింది శాంతమ్మ.

          తలంతా హోరు…………యిదేంటీ?……………..యిలా అవమానించడం ఏంటి ? ప్రతి అంశంలోనూ తేడానే ?అది మాత్రమే కాదు ఆమెని బాధపెడుతున్నది.అతని చుట్టాల యిళ్ళ నుంచి స్త్రీలకి ప్రయాణం లేని కార్డులే యిప్పటి వరకూ వచ్చాయి… అంటే వాళ్లెవరికీ ,మనోహరే కావాలి కానీ తనక్కరలేదు. అన్నింటికన్నా ముందు వాటిలో రెండు మూడు పెళ్ళిళ్ళకి మనోహర్ వెళ్ళాడు. అంతేకాదు………..రాజమండ్రి పెళ్లికి వెళుతూ బాబుని వెంట పెట్టుకుని కూడా వెళ్ళాడు.

        అంటే అతనూ-బాబూ ఒకటీ, తనూ-పాప ఒకటా? పాపకీ, తనకీ లేని కొన్ని అర్హతలు వాళ్ళకి వున్నాయా?…….గుండె బరువుగా మారింది.

          పెరట్లో నూతి గట్టు మీద కూర్చుని ఆలోచిస్తోంది సుమ……..బాబు , పాప తూనీగల్లా ఎగురుతూ ఆడుతున్నారు.. యిద్దరినీ పట్టి పట్టి చూసింది. తనకేం తేడా కనిపించడం లేదు. లోకానికెలా కనిపిస్తోందో !………….” దిగులుగా అనుకుంది.

          దూరం నుంచి మనోహర్ ఆత్రంగా తనవైపే రావడం కన్పిస్తోంది. అతని ప్రేమలో కల్మషం లేదు. అది తనకు తెలుసు .కానీ అతను తనని అక్కర్లేదనుకున్న వాళ్ళదగ్గరికి వెళ్ళాడు.

          “ఏంటి సుమా డల్ గా వున్నావు ?……..ఆమె తల నిమురుతూ అడిగాడు.

          అతని కళ్లలోకి లోతుగా చూసింది . తన పట్ల ప్రేమతో స్వచ్ఛంగా వున్నాయవి.

          ” ‘స్త్రీలకి ప్రయాణం ‘వుంది కాబట్టి నన్ను తీసుకొచ్చావు కదూ!” అడిగింది.

          విస్తుపోయి చూశాడు మనోహర్.

          “నేను , పాప వద్దనుకున్న వాళ్ళకోసం నువ్వూ, బాబు వెళ్ళారు” ఆవేదనగా అంది.

          అతని కళ్ళు బాధతో విలవిల్లాడాయి.

          “నేను అంత దూరం ఆలోచించలేదు. నేను పుట్టిన దగ్గర నుంచే ఈ సంస్కృతీ, ఆచారాల్లో లీనమయుపోయాను. వాటిని పాటిస్తున్నాననుకున్నాను.” మనోహర్ చెపుతుండగా మధ్యలోనే అతని మాటల్ని ఆపేసి ” నీకు తప్పుగా అనిపించలేదా ?……….” ఆరాటంగా అంది.

          అతను అంతర్ముఖుడయ్యాడు.

          “ఈ పద్ధతి ………… ఒక కుటుంబాన్ని ఆడా, మగా పేరుతో రెండుగా విడగొడుతున్నట్లు నీకనిపించడం లేదా?…….. మగాళ్ళని మాత్రమే భోజనాలకి పిలిచే సంస్కృతీ, స్త్రీలకి ప్రయాణం అని చెపితేనే తప్ప వాళ్ళు పెళ్ళిళ్ళకి బయల్దేరలేని దుస్థితి , ముసలాళ్ళయినా , గర్భిణులయినా , చిన్నపిల్లలయినా మగాళ్ళు భోజనం చేస్తే తప్ప వాళ్ళు చేయలేని పరిస్థితీ,……. యివి నీకు నచ్చాయా?…………. యిందులో లీనమవడం నీకిష్టమా ?…………” ప్రశ్నించింది సుమ.

          “మనమేం చెయ్యగలం……..” అసహాయంగా అన్నాడు మనోహర్.

          “చెయ్యగలం,………….కనీసం మనకోసం…………….మన సంతృప్తి కోసం ఏదో ఒకటి చెయ్యగలం ……..ఈ వివక్ష లేని చోటికే మనం వెళదాం ………ఈ వివక్ష కూడదని అందరికీ చెపుదాం నవ్వుతారా నవ్వనీ !…..ఆడవాళ్ళని కించపరిచే యిలాంటి సాంప్రదాయాల్ని రూపుమాపడానికి కృషి చేశామన్న సంతృప్తి మిగులుతుంది……….” అంది సుమ.

          సాలోచనగా తలూపాడు మనోహర్.

          “మధు ఈ రోజు మనిద్దరినీ పిలిచాడు కాబట్టి హమ్మయ్య స్త్రీలకి ప్రయాణం వుందని నేను బయల్దేరొచ్చు…………….కానీ నాలాంటి ఆడవాళ్ళనే చాలా మందిని అవమానించారు. అందుకే యిపుడేం చెయ్యాలో చెప్పు………అంది సుమ.

          లేచి నిలబడ్డాడు మనోహర్…..”ఈ రోజు రాత్రికే బస్ లో వైజగ్ వెళ్ళొపోదాం………. తర్వాత ఫోన్ లో అతనికి మన ఫీలింగ్స్ చెపుతాను………………..” అన్నాడు.

          సుమ హృదయం తేలికయింది.

          అందుకే నాకు అతనంటే ఎంతిష్టమో!!…………….

స్త్రీలను…..వూహూ మనుషులను ఎంత బాగా గౌరవిస్తాడో!!….హిమాలయ పర్వతం కళ్ళముందు నిల్చున్నట్లు వుంటుంది.

రెండు ఒకటవడం కన్నా ఒకటి రెండవడం బాధాకరమే

కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు” అని నేను మునుపెప్పుడో చదివిన మాటలని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న ఈ కలిసుండటం , విడిపోవటం అనే వాదనలకు నా స్పందన…

రెండు ఒకటవడం కన్నా
ఒకటి రెండవడం బాధాకరమే
కానీ…….
ప్రియా
ఒకటయ్యేపుడు పెంచుకున్న నమ్మకాల్నీ
పంచుకున్న ఆశల్నీ
ధ్వంసం చేస్తూ
ఈ రోజు భవిష్యత్తుని
నా ఒడిలోని నవజాత శిశువుగా
నువ్వెంత అభివర్ణించినా
చెరిగిన విశ్వాసాలనూ
చెదిరిన స్వప్నాలనూ
మోసుకుంటూ నీతో కలసి ఎలా నడవను?
ఐతే
ఒకటి మాత్రం నిజం
నువ్వు ఎక్కడ ఐక్యతా రాగాల్ని ఆలపించినా
నా శిధిలాలఫై నువ్వు ఎప్పటికీ కోటని నిర్మించుకోలేవు.

తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్ష

                                                స్థానిక అస్తిత్వ ఉద్యమాలకి తెలంగాణా ఉద్యమం ఒక ప్రత్యేక సందర్భం . గత 50 సంవత్సరాలకు ఫైగా తెలంగాణా ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ బలహీనం కాలేదు అంటే అది తెలంగాణా ప్రజల న్యాయమైన ప్రజాస్వామిక ఆకాంక్షగా గుర్తించాలి. తెలంగాణా ఉనికికి ఆత్మగౌరవానికి సమైక్యాంధ్ర భావన  విఘాతం కలిగిస్తున్నపుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రజాస్వామిక వాదులందరూ స్వాగతించాలి. స్థానికులు  ఏ ప్రాతిపదిక మీద  ఐడెంటిటిని పొందుతారో దానికి సంబంధించిన అధికారం,వనరులు,సంస్కృతీ  స్థానికుల నిర్వహణలోనే వుండాలి.నిర్ణయాధికారం స్థానికులకే వుండాలి. దీనికి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ స్థానిక అస్తిత్వ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. ఈ ఉద్యమాలకి ప్రాంతీయ విద్వేషాలే మూలం అనుకోవడం పొరపాటు. భారత రాజ్యాంగం వ్యక్తులకు ఆమోదించిన రాజకీయ,ఆర్ధిక,పౌర,సాంస్కృతిక హక్కుల్ని ఈ ఉద్యమాలు తిరస్కరించవు. —- కె.ఎన్.మల్లీశ్వరి

ఇది నేను ఆంధ్రజ్యోతి దినపత్రిక వారి అభిప్రాయసేకరణ లో భాగంగా స్కైబాబ గారికి పంపిన అభిప్రాయం. ఇది వివిధ లో ప్రచురించారు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింకు నొక్కండి.   

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/dec/14vividha1

తెలంగాణా ఉద్యమం ఫై ఉత్తరాంధ్ర బామ్మ తీర్పు

                                                      ఈ మధ్య నేను పని మీద విశాఖ కంచరపాలెం ఏరియా కి వెళ్ళాను.అక్కడ ఒక సందు చివర ఒకామె బుట్టలో జంతికలు చేగోడీలు చుప్పులు అమ్ముకుంటోంది.ఇంతలో అటువైపు వచ్చిన సమైక్యాంధ్ర ఆందోళన కారులు షాపులు మూయించడం నినాదాలు చెయ్యడం చూసి అటుగా పోతున్న నన్ను ఆపి “ఏటమ్మా? ఈలంతా ఇలగేటి గొల్లు సేస్తన్నారు?”అనడిగింది.ఇపుడు ఏ.పి. స్టేట్ లో ఎం జరుగుతోందో చెప్పాను.అపుడు…..తను తినుబండారాలు అమ్ముకునే నాలుగు వీధులు,తను నివసించే ఏరియా తప్ప మరో ప్రాంతం ఎరగని ఆ బామ్మఅంది కదా ” ఆళు….. మావు మీతోటి ఉండవని తెగేసి సేప్పేస్తంటే ఈళేటోలే వదలవంతన్నారు.ఈ బావులు సేస్తన్న పని నాకేటీ బాగా నేదు” అనేసింది మరి

……………………………………………………………………………..

మరో ముఖం ( ఆంధ్ర భూమి నిర్వహించిన 2006 ఉగాది కథల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన నేను రాసిన కథ)

                                                          సుధాకర్ తన భర్తయినందుకు లోకం తనని ఎంతో అదృష్టవంతురాలిగా కీర్తించింది. తనకీ నిజమేననిపించింది. పెళ్ళి చూపుల్లో, పెళ్ళిలో, పెళ్ళయాక అతని చూపులు తన చుట్టూ తారట్లాడటం గమనించాక చిరుగర్వం కలిగింది. ఆ తర్వాత నాలుగు నెలలూ నాలుగు నిమిషాల్లా గడిచిపోయాక ఓ రోజు అతను శుభవార్తంటూ చెప్పిన కబురుతో హఠాత్తుగా ఈ లోకంలోకి విసిరివేయబడ్డాను.

          “ఇంకో నెలలో దుబాయ్ ప్రయాణం .. అక్కడ మంచి వుద్యోగం దొరికింది.బాగా సంపాదించొచ్చు. ఎంతా ? నాలుగయిదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మనం హాయిగా గడపడానికి అవసరమైనంత సంపాదించి వచ్చేస్తాను. సంవత్సరం తిరిగేసరికి స్థలం కొనేస్తాను.రెండేళ్ళకు యిల్లు, మూడేళ్ళకి బ్యాంక్ బాలెన్స్ …. నాలుగేళ్ళకి పిల్లల పేర్ల మీద ఫిక్సెడ్ డిపాజిట్లు… నీ ఇంటి నిండా బంగారం ” అతను హుషారుగా చెప్పుకుపోతుంటే నా మనసంతా భారంగా మారింది.

          “మీరు వెళ్ళాలా ?” దిగాలుగా అడిగాను.

అతను ఓ క్షణం వినరాని ప్రశ్న విన్నట్లు అయోమయంగా చూసి పకపకా నవ్వేసి ” నా దగ్గరంటే అన్నావు యింకెవరి దగ్గరా  అనకు నవ్వుతారు ” అన్నాడు.

          అపుడు చెప్పాను నా దిగులుకి కారణం. సంభ్రమంగా చూశాడతను.

          “వెరీగుడ్ మళ్ళీ సంవత్వరానికి నేను వచ్చేసరికి నా వారసుడిని ఎత్తుకుని స్వాగతం చెపుతావన్నమాట ” మెరుస్తున్న కళ్ళతో చూస్తూ అన్నాడు. అతను అతని గురించి ఆలోచించాడు.నేను యింకేమనలేక పోయాను. ఆ తర్వాత అతను ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయాడు.

          వెళ్ళే రోజు వచ్చింది. బందువులంతా అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. అంత హడావిడిలోనూ నా దగ్గర వీడ్కోలు తీసుకునేందుకు కాబోలు నన్ను లోపలికి పిలిచాడు.

          వెళ్ళగానే కౌగిలించుకున్నాడు .అతనికి కళ్ళు నా ముఖాన్ని ప్రేమగా తడిమాయి. వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది . ఒకే ఒకనిమిషం అంతే!

          ఆ! ఉమా ! చెప్పడం మరిచిపోయాను. నువ్వు ఈ యింట్లోనే వుండు. ఎవరినీ రానివ్వద్దు మీ అమ్మగారిని తోడుగా వుంచుకో !” అన్నాడు.

          నాకు మా అమ్మా,నాన్న పసుపు కుంకుమల కింద ఈ యిల్లు రాసివ్వడమూ, అన్నయ్యకి వ్యాపారంలోనష్టం వచ్చి యింటద్దె కట్టుకోవడం కష్టంగా వుందని , అల్లుడు తిరిగొచ్చేవరకూ నాకు తోడుగా మా అన్నయ్య ఫామిలీ యిక్కడ వుంటారనీ మా నాన్న యితన్ని అడగడం గుర్తొచ్చింది.

          “మా అన్నయ్యకి .. కష్టంగా “ఏదో నసిగాను.

          “వద్దు .సందిచ్చామంటే జీవితాంతం కదలరు” అసహనంగా అన్నాడు. 

ఆ విషయం అక్కడితో ముగిసింది.

          అతను దుబాయ్ వెళ్లిపోయాడు నన్ను ఒంటరిగా వదిలేసి, నా చుట్టూ ఎందరున్నా నేను ఒంటరినే . ఎందుకంటే భర్తే సర్వస్వమనీ అతని తోడిదే లోకమని  అందరూ ఢంకా బాజాయించి చెప్పారు. నిజమనుకుని నేనూ నమ్మాను కాబట్టి.

          నాతో పాటు అమ్మ ఉండేది. ఆమె ఎపుడూ బాధతోనూ , ఆక్రోశంతోనో వుండేది. అల్లుడి మీది కినుకను నా ముందు ప్రదర్శించేది . మా అమ్మకు అర్థమయినా కాకపోయినా నేను మాత్రం ఓ విషయం గ్రహించగలిగాను. అది నేనయినా, మా అమ్మ అయినా పాత్రధారులమే తప్ప సూత్రధారులం కాదని. మన్ను తిన్న పాము ఎలా కదులుతుందో తెలీదు కానీ కాలం మహా బద్ధకంగా కదలడం తెలుస్తోంది……… అతను లేకపోవడం అన్నది నా జీవితంలొ ఎన్నో విషయాలని ప్రభావితం చేస్తోంది.

          స్నానం చేసి బీరువా దగ్గరికి వెళ్లి బట్టలు తీసుకునే ముందు మంచి చీర మీదకి చెయ్యి వెళ్లినా ‘ఆ! అతను లేనపుడు  పాత చీర కట్టుకుంటే మాత్రం యేం.’ అన్పించేది.

          ఓ రోజు మరీ విసుగనిపించి సినిమాకి వెళదామని తల్లి సణుగుతున్నా ఆమెని తోడు తీసుకుని బయల్దేరినపుడు ఓసారి చూసిపోదామని వచ్చిన మామగారు వాకిట్లో ఎదురై’ సినిమాకా ?’ అంటే  ఘోరాతిఘోరమైన నేరస్థురాలిని చూసినట్లుగా గుచ్చిన చూపు చురుక్కుమనిపించింది.

          కంప్యూటర్లో మొయిల్స్ పంపడం , చాటింగ్ నేర్చుకోమని సుధాకర్ పోరగా రోజూ ఇన్ స్టిట్యూట్ కి వెళ్లేపుడు యిరుగూ పొరుగూ కొత్తగా ‘ఏమ్మా ! ఎక్కడికీ ! ‘ అంటూ తీసే ఆరాలు బెరుకుని కలిగించేవి. అలంకరించుకోవాలన్నా, మంచి తిండి తినాలన్నా, నలుగురులో కలవాలన్నా, నవ్వాలన్నా నడవాలన్న, అనాసక్తత . మొయిల్స్ చెక్ చేసుకోవడం, కంప్యూటర్లో అతనితో ఛాటింగ్ చెయ్యడమూ యివే వుద్వేగభరితంగా వుండేవి. అతను క్లుప్తంగా మొయిల్ చేసినా తను చాలా ఎక్కువ మెసేజ్ లు పంపేది.

          నెలలు నిండాయి. బాబు పుట్టాడు. తను కదలలేకపోవడంతో అతను ఫోన్లు చేసేవాడు.అన్నట్లుగానే బాబుకు మూడో నెల వచ్చేసరికి రెందు నెలల సెలవుతో అతనొచ్చాడు. నా హృదయానికి పండగొచ్చింది . రాగానే నన్ను చూస్తాడనుకున్నాను. కానీ అతృతగా కొడుకు మొహం చూస్తూ ఎత్తుకున్నాడు . అతని మొహంలో గర్వం తొణికిసలాడింది.

          “ఈ రెండు నెలలూ నన్ను విడిచి ఒక్క క్షణం కూడా వుండొద్దు” ఆ రోజు రాత్రి అతని కౌగిలిలో కరిగిపోతూ అన్నాను. వారం రోజులు యిద్దరం బయటి ప్రపంచాన్ని మర్చిపోయాం. ఆ తర్వాత అతను ఆర్థిక ప్రణాళికల ప్రకారం స్థలం వెతికే పనిలొ పడ్డాడు. వాళ్ళ వూరు తరచుగా వెళ్లేవాడు . యిపుడు అక్కడ అతనికి పరపతి బాగా పెరిగింది. విదేశాలకి వెళ్లి డబ్బు సంపాదించి యిక్కడ ఆస్తులు కొని ఈగోని తృప్తి పరుచుకొవాలనుకుంటున్నాడు. నేను మౌనంగా వుండటం తప్ప మాట్లాడటానికి ఏం వుందని??

          మళ్ళీ అతను వెళ్ళే రోజు వచ్చింది. నేను దిగులుగా వుండటం చూసి “  నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఉమా…………… ఎంతో మంది దుబాయ్ వెళ్లి వుద్యోగ విషయాల్లొ మోసపోయి అక్కడ వుండలేక యిక్కడికి రాలేక అష్ట కష్టాలు పడుతున్నారు . వాళ్ళ భార్యల్తో పోల్చుకుంటే తెలుస్తుంది నీ అదృష్టం ” అన్నాడు.

          నాకు తిండికీ, బట్టలకీ డబ్బు పంపినంత మాత్రాన నేను సుఖంగా వుండి వుంటానని అతననుకుంటే అది చాలా అమాయకత్వం. నిట్టూర్చాను.

          అతను యిండియా వచ్చిన పని విజయవంతంగా నెరవేర్చాడు. మంచి సెంటర్లో స్థలం కొన్నాడు. నన్ను మళ్లీ యింకో వారసుడి కోసం సిద్ధం చేసాడు.

          ఫోన్లో నేను చెప్పింది వినగానే ” ఈ సారి పాపయినా ఫర్వాలేదు ” సర్దుకుపోతున్నట్లు అన్నాడు.

          అమ్మకి విసుగు ఎక్కువైంది. పనిచేసి చేసీ అలసిపోయేది. పసిపిల్లాడితో పనంటే మాటలా?

          ఈ సారి కానుపయ్యాక రెండు నెలలకి మించి వుండను. నాకు మాత్రం సంసారం లేదా ? నా కొడుకూ, కోడలూ ఏవనుకుంటారు ? మీ అత్తని పిలిపించుకుంటావో, మీ ఆయన్నే రప్పించుకుంటావో … నేను మాత్రం వుండను ” ఖరాఖండిగా చెప్పింది.

          నాకేం బాధ వెయ్యలేదు.అమ్మ పట్ల, ఆమె చేసిన సేవ పట్లా కృతఙ్ఞతా భావం కలిగింది.

          ఈ సారీ సుఖ ప్రసవం అయి ఆడపిల్ల పుట్టింది. రెండో సంవత్సరం నెల రోజుల సెలవు మీద వచ్చాడు . “యిక పిల్లలు చాలు” అన్నాడు. నన్ను ఆపరేషన్ చేయించుకోమని, మళ్లీ ఎందుకో ‘వద్దులే’ అన్నాడు.

          వాళ్ల నాన్నకి డబ్బిచ్చి , యింటి ప్లాన్ యిచ్చి, యిల్లు కట్టించి అద్దెకివ్వమని చెప్పాడు. అతను బయల్దేరి వెళ్ళేపుడు ‘ నేను మిమ్మల్ని వదిలి వుండలేకపోతున్నానండీ !” కన్నీళ్లతో అన్నాను.

          “అలా అంటే ఎలా ? మనం డెవలప్ అవ్వొద్దా. నువ్వు నన్ను ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరిస్తే ఎలా?” కొంచెం విసుగా అన్నాడు.

          ఏదో మనసులొ వున్న బాధని ఆపుకోలేక అడగడమే గానీ అతను తన మాట వింటాడన్న ఆశ వుంటే కదా! అమ్మ వెళ్ళిపోతానన్న విషయం చెప్పి అత్తయ్య గారిని పంపమన్నాను.’ ఈ పిల్లాజెల్లతో అమ్మ పడలేదు గానీ పనిమనిషిని పెట్టుకో . డబ్బు కొంచెం ఎక్కువ పంపిస్తా ! ‘ అన్నాడు.

          అతను వెళ్ళిపోయాడు.

          అమ్మ వెళ్ళిపోయింది.

          నేనే మిగిలాను యిద్దరు పిల్లలతో.

          ఇంతకాలం వరస కానుపులతో వుక్కిరి బికిరైన మనశ్శరీరాలు నెమ్మదిగా సేదతీరసాగాయి. పనమ్మాయిని పెట్టుకున్నాను. పిల్లల పని తప్ప మిగతా పనేమీ కష్టం అన్పించేది కాదు.

          ఖాళీ సమయంలొ అతను గుర్తొచ్చేవాడు. మధురోహలు మనస్సుని చీల్చుకుని శరీరం మీద దాడిచేసేవి. నా పరిస్థితే యిలా వుంటే అతనెంత అవస్థ పడుతున్నాడో అనిపించేది.

          “సవ్వడైతే చాలు ప్రభూ ! రివ్వున స్మర శరం దూసుకుపోతోంది” ఓ రోజు అతనితో ఫోన్లో అన్నాను. అర్థం కాలేదన్నాడు. రిపీట్ చేశాను. అతను మౌనం వహించి మాట మార్చాడు. అతనంత కంట్రోల్లో వున్నపుడు తనిలా బైట పడినందుకు సిగ్గనిపించింది.

          పిల్లలతో తను బైటికి వెళ్లలేకపోవడంతో మెయిల్స్, ఛాటింగ్ తగ్గాయి. మాటల్ని డబ్బుతో తూకం వేసి అపుడపుడూ ఫొన్లో ఆచితూచి మాట్లాడుకోవడం తప్ప దూరాల్ని దగ్గర చేసుకున్న తృప్తి కలిగేది కాదు.

          మూడో సంవత్సరం సెలవు దొరకలేదనీ రాలేననీ అతను చెప్పినపుడు భోరున ఏడ్చాను. విరహం యింత భయంకరంగా వుంటుందని యిప్పటి వరకూ తెలీదు. యిది మనసుదా? శరీరానిదా ? అన్న ప్రశ్న మనసులొ వుదయించినపుడు పాపభీతితో వణికి పోయాను. యింకో సంవత్సరం అతని తోడు కోసం, అతని కౌగిలికోసం, అతన్ని చూడటం కోసం ఆగాలన్న విషయం వుండటం గుబులు పుట్టించింది.

          నేను మామూలుగా మనిషిగా స్వచ్ఛమైన ఆడదానిగా వుండటం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకి తపస్సు ఫలించి దేవుడు ప్రత్యక్ష్యమైనట్లు నాలుగో సంవత్సరం నిండేసరికి అతనొచ్చాడు. ఈ సారి ఎలాగైనా అతన్ని వెళ్ళనివ్వకూడదు ‘సంపాదించింది చాలదా’ అని గట్టిగా అడగాలని నిశ్చయించుకున్నాను.

          ఆ రోజు రాత్రై పిల్లలిద్దరూ నిద్రపోయాక డాబా మెట్ల మీద వెన్నెల్లో కూర్చుని అతని భుజం మీద తలానించి కువకువలాడుతూ ” ఆ వెన్నెల చూడండి ఎంత వెచ్చనవుతొందో ……. ఈ సన్నజాజులు సువాసనతో ఎలా మత్తెక్కిస్తున్నాయో ! ఈ పిల్ల గాలి మీకు హత్తుకుపొమ్మని ఎలా ఆఙ్ఞాపిస్తోందో ! యిదంతా మనం పక్కపక్కన వుండబట్టే కదా !”  నా స్వరం నాకే మధురంగా విన్పించింది. అతని స్పర్శతో తనువంతా మత్తెక్కుతోంది………..

          అతను ఒక్క క్షణం నా వంక నిదానించి చూసి “జీవితం అంటే విచ్చలవిడితనం కాదు . జీవితం అంటే బాధ్యత…………. అది ఆడవాళ్ళ కనీస బాధ్యత. అతను “బాధ్యత” అన్న మాటని మూడుసార్లు ఒత్తిపలికి చివ్వున లేచి లొపలికి వెళ్లిపోయాడు.

          నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఈ సంవత్సరం అతనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. యిదివరకులా తనని దగ్గరికి తీసుకోవడం కోసం అతృత పడటం లేదు. ఎన్నో సంవత్సరాలనుంచీ కాపురం చేస్తున్న వాళ్ళలా యాంత్రికంగా వున్నాడు.అతనన్న మాటల్ని జీర్ణించుకునే లొపే సెలవులయిపోయి వెళ్ళిపోయాడు.

          ఇక ఆ తర్వాత నుంచీ నా తిప్పలు ప్రారంభమయ్యాయి. తండ్రో , భర్తో అన్నొ పక్కన లేని ఆడదాన్ని చూస్తే చాలా మంది మగాళ్లకి’ ట్రై’ చేసి చూడాలన్న వుత్సాహం పొంగి పొర్లుతుందనుకుంటా! ఏదో రకంగా మాట్లాడించడం కోసం ఆరాటపడేవారు. మొహంలొకి చిరాకునీ, మాటకి పెళుసుదనాన్నీ అద్దెకు తెచ్చుకుని అలాంటి వాళ్ల నుంచి తప్పించుకునేదాన్ని.

          కానీ తోడు కోసం మనసు ఆరాటపడేది .మోహం వెల్లువెత్తేది. ప్రేమగా పలకరించేవారి కోసం సరదాగా కలిసి నవ్వుకునె వారి కోసం హృదయం వెతికేది…. బుద్ధి వద్దనేది ………..అదిగో అలాంటి సమయంలొనే పరిచయం అయ్యాడు నవీన్. మా పక్కింట్లొ అద్దెకి దిగాడు. టీచరట , బ్యాచిలర్ కావటంతో మంచినీళ్ళకోసం, పాలతోడు కోసం వచ్చేవాడు. నేను ముభావంగానే వుండేదాన్ని . కానీ నవీన్ తన వాక్చాతుర్యంతో నన్ను నవ్వించాలని చూసేవాడు . నన్ను చూడగానే అతని చూపులు ఆరాధనగా మారిపోవడం……….నన్నో అపురూపమైన వ్యక్తిగా చూడటం నన్ను మైకంలొ పడేసేవి.

          ఓ రోజు మా ఇంట్లో నా ఎదురు కుర్చీలొ కూర్చుని మాట్లాడుతున్నవాడల్లా లేచి సోఫాలో నా పక్కన కూర్చుని నా చెయ్యి పట్టుకు ” మీ చెయ్యి చూసి జాతకం చెబుతాను ” అంటూ ఆత్రుతగా నా వంక చూశాడు. అతని వేళ్ళు నా చేతిని మృదువుగా నిమురుతున్నాయి.

          ఎంత కఠినమైన పరీక్ష యిది……………!! నేను తలదించుకుని మొహంలొ చిన్న సిగ్గుతెరని పలికిస్తే చాలు ………. అతను ప్రొసీడవుతాడు.

          ఆ నిమిషంలొ నా అంతఃక్షేత్రంలొ జరిగిన సంఘర్షణ లో నేనే విజయం సాధించాను తలెత్తి అతని వంక చూస్తూ ” నవీన్! ఒకవేళ నేను నా భర్తకు విడాకులు యిచ్చి నా పిల్లలతో సహా మీ దగ్గరికి వస్తే నన్ను పెళ్ళి చేసుకుంటారా?”అడిగాను.

          నివ్వెరపోయాడతను . ఠక్కున నా చేయి వదిలేసి “ఎందుకండీ! బంగారం లాంటి మీ కాపురం గురించి అలాంటి మాటలు ” అంటూ తడబడి కాసేపు యిబ్బందిగా అటూ యిటూ చూసి వడివడిగా లేచి వెళ్ళిపోయాడు . నాకు నవ్వొచ్చింది . యిలాంటి అవకాశవాది మాటలా కొన్నాళ్ళయినా నన్ను మైకంలో ముంచాయి ! ఆ తర్వాత ఎంతో అవసరమైతే తప్ప అతను యిటు తొంగి చూడటంలేదు.

          ఈ సంఘటనతో నేనో నిశ్చయానికి వచ్చాను. మా ఆయన్ని ఎలాగైనా యిండియా రప్పించాలి. ముందు చెప్పినట్లుగా అయిదేళ్ళు అయిపోవచ్చాయి. అతను ఫోన్ చేసినపుడు ఈ విషయమై పట్టుబట్టాను.

          “ఇపుడు నీకొచ్చిన యిబ్బంది ఏంటో ? విసుగ్గా అన్నాడు.

          “మీకేమి యిబ్బంది లేదా ? ఎదురు ప్రశ్నించాను

          “నాకేం వుంటుంది ?” అసహనంగా అన్నాడు.

          “మీరు పూర్తిగా ఆనందంగా వున్నారా ?” సూటిగా అడిగాను.

          ఏవర్థమయిందో ఏమో తత్తర పడి ఆ తర్వాత విసురుగా ఫొన్ పెట్టేశాశు.

          నాకొక విషయం అర్థమైంది.అతను యిప్పట్లో యిండియా రాడు.డబ్బు సంపాదన అతనికి రుచిగా వుండి వుండొచ్చు. కానీ యితర సంతృప్తులు ఎలా లభిస్తున్నాయి? నా మనసులొ అనుమానం అంకురించింది .భయంతో వణికిపోయాను . ఎవరితో ఏవని చెప్పుకోను?

          కొన్నాళ్లకి తెలిసింది నా అనుమానాలు నిజమేనని. దుబాయ్ నుంచి మా నాన్న దూరం చుట్టం వస్తూ మా ఆయన కథని కూడా తెచ్చాడు. యిండియా నుంచి ఆయన లాగే సంపాదన కోసం వెళ్లిన ఓ యువతీ , మా ఆయన కలిసి అక్కడ భార్యభర్తలుగా చెలామణి అవుతూ ఒకే ఇంట్లో వుంటున్నారు.

          కళ్ళ ముందు ప్రపంచం గిరగిరా తిరుగుతున్నదనిపించింది. తర్వాత అర్థమైంది. ప్రపంచంకాదు మా వైవాహిక బంధమే సుడిగుండంలో చిక్కుకుని గిరగిరా తిరుగుతోందని.

          తన కొడుకు బాగు చూసి ఓర్వలేక ఆ చుట్టాలాయన యిలాంటి పుకారు పుట్టించాడని చెప్పి మా అత్తామామలు ఆయన యింటి మీద పడి గొడవ చేసారు. దాంతో అతనికి మంటెక్కిందనుకుంటా. అతను మళ్లీ దుబాయ్ వెళ్ళాక ఆ యువతీ, మా ఆయన సన్నిహితంగా బయట తిరుగుతున్నప్పుడు ఫొటోలు, వీడియో తీసి పంపాడు.

          ఇక అందరూ నమ్మారు. కానీ ప్లేట్ మార్చేశారు. ‘మగాడన్నాక ఎన్నాళ్లని కోరికలను అణచిపెట్టుకుంటాడు ? పెళ్ళాం పిల్లల్ని పోషిస్తునాడు కాబట్టి నోరు మూసుకుని పడుండమన్నారు అత్తమామలు. అమ్మానాన్నలు ఓ ఏడుపు ఏడ్చి వూరుకున్నారు .

          అతనితో ఫోన్ లొ గొడవపడితే “అదంతా ట్రిక్ ఫొటోగ్రఫీ …………….నమ్మొద్దు “అన్నాడు. తను లాజిక్ తియ్యబోతే “యింకా విషయాలు వదిలేయి . ఈ మాత్రం ఫోన్లు కూడా చెయొద్దా?” గట్టిగా అనే వాడు. అందులొ అంతర్లీనంగా వున్న బెదిరింపు బెంబేలెత్తించేది. యిక పెళ్లికి ముందు తను ఊహించుకున్న అందమైన, ఆదర్శమైన జీవితం తనకి లేనట్లే ! యింతకీ అతను తనని పెళ్ళెందుకు చేసుకున్నాడు ? ఈ ప్రశ్న పదే పదే వేధించేది.

          కాలక్షేపం కోసం చదివే పుస్తకాలే తనకి సమస్యల మూలాల్ని విప్పి చెప్పాయి. అతను ఈ పితృస్వామ్య సమాజానికి ప్రతినిధి. అతను సొంత ఆస్తిని సంపాదించుకుంటాడు. ఆ ఆస్తిని  తన ద్వారా పుట్టిన పిల్లలకి సంక్రమింపచేస్తాడు. ఈ క్రమంలొ అతనికి వారసుల్ని కనిచ్చి వాళ్ళని జాగ్రత్తగా సంరంక్షించడమే స్త్రీల పని……తనపని.. అందుకే తను అతనికి పనికొచ్చే వస్తువుగా మాత్రమే కనిపించింది.

          శతాబ్దాల తరబడి స్త్రీ పనిముట్టు లేదా భోగ వస్తువు,…… అవును…. వస్త్రం, ఆభరణం, గంధం , పుష్పం, తాంబూలం మొదలైన వాటిలా స్త్రీ భోగ వస్తువుని మన పండితులెపుడో సిద్ధాంతీకరించారు.

          ఆ కాలంలొ ప్రతి రాజుకీ భార్యలు, ప్రియురాళ్ళు, యుద్ధాలలో జయించి తెచ్చుకున్న స్త్రీలు కలిపి అనేక వందల మంది. వాళ్లంతా ప్రతి రాత్రీ సింగారించుకుని తమ హృదయాధినాధుని కోసం విరహంతో వేగిపోతూ ఎదురుచూసేవారు  ఒక్కొక్కరూ సంవత్సరం పైన ఎదురుచూడాలి.

          ఇంతమందిలొ రాజుకు ఏ స్త్రీ అయినా అధికంగా నచ్చి ఆమె దగ్గర ఎక్కువ రోజులు వుండిపోతే ! అందుకే భర్త కోసం,………………… భర్తలొ వున్న మగాడి కోసం ఆ అంతఃపుర రాణులు సాగించిన అంతఃకలహాలూ, అసూయలూ, మారణహోమాలు……….యివి చరిత్ర చెప్పని సత్యాలు.

          ఆ అంతఃపుర రాణులు అడవి గాచిన వెన్నెలలు.

          ఆ లక్షలాది స్త్రీలు ఏళ్ల తరబడీ మోహాల్ని ధ్వంసం చేసుకున్న విరహానలలు. చరిత్ర ఆ విధ్వంసానికి మేలి ముసుగు తొడిగింది. పురుషుల విశృంఖలత్వాన్ని రసికతగా భ్రమింప చేసింది.

          అంతఃపురద్వారపాలకులుగా మగవారిని గాక ఆడవారిని, నపుంసకులను నియమించండలోని వాస్తవికత అర్థమవుతోంది.

          నాకిపుడు దుఃఖం కుదిపేస్తోంది…… అప్పటికీ యిప్పటికీ మగవాళ్ళింతేనా ? ఆడవాళ్ళూ యింతేనా ?

            నేనిలా ఆందోళనగా వున్న సమయంలొ మా అత్తామామలు ఏదో పని మీద సిటీ వచ్చి” పిల్లల్ని చూడటం కోసం” మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేస్తున్నాను.సాయంత్రం అయిదు గంటలకి నవీన్ వరండాలో నిల్చిని ఖాళీ వాటర్ బాటిల్ చేతికొచ్చి మంచినీళ్ళడిగాడు.

          మా అత్తామామలు తొంగి చూసి మొహాలు మాడ్చుకున్నారు. బహుశా నవీన్ వచ్చినందుకు కాబోలు. వాళ్ళు ఒక్క రోజు కూడా వుండలేదు. ఆ రాత్రికే వెళ్లిపోయారు.

          తెల్లారే సుధాకర్ ఫోన్ …………. అతను నా దినచర్యనీ……….. నా చుట్టుపక్కల ఎవరుంటారన్న దాని గురించి అడిగాడు. అతని మాటలు ఒకింత పరుషంగా వున్నాయి.

          తర్వాత గంటకి అమ్మానాన్నల ఫోన్ ……….మొగుడి గురించి భయంలేకుండా చెడు తిరుగుళ్ళు మొదలు పెట్టిన ఆడదాన్ని లోకం ఎలా కాకుల్లా పొడుచుకు తింటుందో వాళ్ళనీ వీళ్ళనీ వుదాహరణాలుగా చూపించి అన్యాపదేశంగా హెచ్చరించారు.

          మూడో రోజుకల్లా మా అత్తగారూ, మరిదీ లగేజీతో వచ్చారు . వాళ్ల మాటల్ని బట్టి తేలిందేంటంటే వాళ్లిక్కడే వుండబోతున్నారు. మామూలుగా అయితే చాలా సంతోషించే దానే !

           కానీ వాళ్ళు నాకు ‘కనపడని యినుప కచ్చడాలు’తొడగడానికి పంపబడిన వాళ్లు. మనసు అయిష్టంగా మారింది. అతనిలో మరో ముఖపు వికృతత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను.

          ఇక అప్పట్నుంచి అడుగు తీసి అడుగేస్తే సవాలక్ష సందేహాలూ, ప్రశ్నలూ, పాతివ్రత్య ధర్మపు బోధనలు, ఫోన్లో అతని అనుమానపు వేధింపులూ వీటితో విసిగిపోయాను. అతన్ని యిండియా వచ్చేయమని వాదించి అలసి పోయాను.

          చివరికి నేనొ నిశ్చయానికి వచ్చాను. యింతవరకూ మా బంధంలో శిథిలమైనవి ఏవైనా వుంటే అవలానే రాలిపోనీ !  ఆ స్థానే యికనైనా అనురాగం, చిగుర్లెత్తాలి. అలా అతనికి యిష్టం లేకపోతే తను తన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి.

          దీనికి ప్రాంరంభంగా అతను యిండియా రావాలి. లేదా నన్ను దుబాయ్ తీసుకెళ్ళాలి. మేమిద్దరం కలిసి ఆనందంగా జీవితం గడపాలి. యిందుకు అతను అంగీకరించాలనీ లేదా విడాకులకు సిద్ధపడాలనీ లాయర్ నోటీస్ యిప్పించాలని బయల్దేరాను.

          “ఎక్కడికీ పెత్తనాలు ?” మా అత్తగారు ముచ్చటగా అడిగింది. నేను సమాధానమివ్వలేదు.

          రోడ్డుమీద పెద్ద వూరేగింపు. ప్రపంచీకరణ నేపథ్యంలో శిథిలమవుతున్న మానవ సంబంధాల గురించి ఆందోళన చేస్తున్నారు వాళ్ళు. రెండొందల మంది పైగా మగవాళ్ళున్న ఆ వూరేగుంపులో పట్టుమని పదిమంది ఆడవాళ్ళు కూడా లేరు. నేనూ ఆ గుంపులొ కలిసాను. ” ఆకాశంలో సగం’విస్తృతిని అర్థం చేసుకోలేక యిరుకిళ్లలో బంధించి తాళాలు వేశారు. అవిపుడు విరిగి పోతున్నాయి తెలుసా? నా పక్కనాయనతో అన్నాను. అతను అయోమయంగా చూశాడు. నేను మనసారా నవ్వి స్వేచ్ఛగా మిగతా వారితో గొంతు కలిపి నినదించాను.

సుంకరమెట్ట సంతలో ఎయిడ్స్ ప్రచారం

                             ఈ ఆదివారం ఉదయం లేవగానే నగరానికి దూరంగా ఎక్కడికయినా పారిపోవాలనిపించింది. ఆలోచన చెప్పిందే తడవుగా చందు ,స్నిగ్ధ స్నానాలు చేసేసి తినుబండారాలు ఇతర సరంజామా బ్యాగుల్లో సర్దేసి బయల్దేరిపోయారు. “ఇటు వంద….అటు వంద కిలోమీటర్ల ప్రయాణం ఓ లెఖ్ఖా? అందమయిన అరకు ప్రయాణం ముందు ? “ చందూ తన్మయంగా అన్నాడు. శృంగవరపుకోట దగ్గర ఆగి రోడ్డు పక్కన బండిమీద అమ్ముతున్న రుచికరమైన ఇడ్లీతిన్నాం. ఘాట్ రోడ్ దగ్గరకి వచ్చేసరికి ఉదయం ఎనిమిదిన్నర గంటలు….. అప్పటికి కూడా మంచు పొగపిట్టలాగా లోయల్లోకి గిరికీలు కొడుతూనేవుంది. దారిపొడవునా మార్గానికి ఇరుపక్కలా పరచుకున్న పచ్చదనం కంటికి ఇంపుగా ఉంది. కోతులు అటూ ఇటూ దూకుతూ హడావిడి పడుతూ స్నిగ్ధ  కళ్ళని చంచలం  చేశాయి  

                           సుంకరమెట్టకి రాగానే ప్రయాణానికి బ్రేక్  పడింది.  ఆ రోజు సంత జరుగుతోంది. సంత నిండా తాజా బీన్స్ పిక్కలు , టమాటాలు, క్యారట్ , వంకాయలు భలే చవకగా దొరికాయి. చందూ కూరగాయల హడావుడిలోవుండగా నా దృష్టిని వేరొకటి ఆకర్షించింది. ‘మీ నేస్తం’ వ్యాన్ ఆ సంతలో రద్దీ ఏరియాలో ఆగి ఉంది. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లోఅవగాహన కలగడం కోసం ‘ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణాసంస్థ ‘ చేస్తున్నప్రచారం అది. బుర్రకథ లాంటి జానపద కళా రూపాన్ని వినియోగించుకుంటూ గిరిజనుల్లోచైతన్యం కోసం చేస్తున్నప్రయత్నమది.

                          లూకాబాయి అనే అసిస్టెంట్ ప్యారామెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతోంది.  ‘నటరాజ బుర్రకథాసంఘం ‘, సబ్బవరం వారు ఆ వ్యాన్లో ఉన్నారు.  చిత్ర అనే ఆమె బుర్రకథని కంచుకంఠం తో ఆలపించింది. స్థానిక  గిరిజనులు ,మాలాంటి పర్యాటకులు వ్యాన్ చుట్టూమూగి బుర్రకథని  ఆసాంతం విన్నాం.  నెల రోజులనుంచీ వారు గ్రామ గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బుర్రకథ అయిపోగానే చాలా మంది తమ సందేహాలు వారిని అడిగితెలుసుకున్నారు. రద్దీగా ఉన్న ఆ  ప్రాంతంలో కదలడానికి చోటులేక నా ముందు కావడి వుంటే  కావడిబద్ద మధ్యలోంచి దాటుతూ ఉండగానే నా ఆలోచనల్లో మా నాయనమ్మ తళుక్కుమంది. చిన్నపుడు కావిడిబద్ద దాటితే ఎన్నిముక్కచీవాట్లు పెట్టేదో గుర్తొచ్చి బిక్కువిక్కుమంటూ కావిడి ఓనర్ వంక చూశాను.  అడ్డపొగ వేస్తూ అలౌకిక ఆనందంలో ఉన్న ఆ ఓనర్ నా చర్యకి తన  ఆనందం భగ్నమయి ఉగ్ర స్వరూపంతో ఏదో అనడానికి నోరు తెరవగానే గుండె బేజారెత్తింది. ఆయనికి ఓ దండం, ఓ క్షమాపణ చెప్పేసి చెవులు మూసుకుని అక్కడ నుంచి పరుగో పరుగు.

                            అరకు మ్యూజియమ్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.అందులోని బొమ్మలు జీవం ఉట్టిపడేలా ఉండడమే కాదు,ఆ బొమ్మల అమరిక,లైటింగ్ అన్నీ సహజ వాతావరణాన్ని సృష్టించాయి. 

                           ఇదంతా అమర్చిన టీం గురించి ఏవైనా వివరాలు తెలుస్తాఎమోనని వెతుకుతుండగా ఈ కింద విషయాలు తెలిసాయి.

 museum of habitat                                                  

  venkat

design -collection -composition

jatara,50-88,1/b,santhipuram,visakhapatnam-16

                            అన్న వివరాలు దొరికాయి.వీలైనపుడు కలిసి అభినందించాలి అనుకున్నా.

                            అరకు మ్యూజియమ్ లో నాకు చాల వివరాలు దొరికాయి. అందులో కొన్నిసేకరించాను. ఉత్తరాంధ్ర లో ఏయే జిల్లాల్లో ఏయే గిరిజన తెగలు వున్నాయో తెలిపే బోర్డులు కనిపించాయి

                              1. విశాఖపట్నం జిల్లా -గదబ,దులియ,భగత గౌడు,కొండదొర కోండులు,కొండ కమ్మర, కొటియ,కూలియా,ముఖాదొర (nooka dora) 

                              2.  శ్రీకాకుళం జిల్లా- భగత,గదబ,గౌడు,జాతాపు,కొండదొర,ముఖదొర,వాల్మీకి,కోండులు,మాలి,పోర్జ,సవర,    

                              3.  విజయనగరం జిల్లా-భగత,గదబ,దులియ,గౌడు,జాతాపు,కొండదొర కోండులు, కొటియ, మాలి,సవర,పుటియా,ఫైకో

                              4. తూర్పుగోదావరి జిల్లా-కొండ దొర,కొండ రెడ్డి,ముఖాదొర,వాల్మీకి.

                                                               గిరిజన నృత్యాలు

                            1. థింసా-అన్ని గిరిజన తెగలవారు.

                           2. మయూరి-కోండులు.

                           3. డుడున్గా-బోడోమలీలు

                            4. పెండ్లి నృత్యం-భగత

                           5. కోలాటం-కొటియ

                           6. కంగారి నృత్యం-గదబ

                           7. నంది ఆట-పోర్జ

                           8. కొమ్ము నృత్యం-కోయ

                            9. అందెల రవ్వలి-సవర

                                                                  గిరిజన పండుగలు

                            1. చైత్ర పండుగ(ఇటికెల పండుగ)

                            2. పెద్ద పండుగ

                           3. భీమదేవుని పండుగ

                           4. కొర్ర సామల కోత పండుగ

                           5. గౌరమ్మ పండుగ

                            6. మెట్ట ధాన్యం కోత పండుగ

                            7. ద్యాది పండుగ

                            8. చిక్కుడు కోత పండుగ

                           9. గంగ దేవుని పండుగ

                           10. నంది దేవుని పండుగ

                             ఈ పండుగ లన్ని రుతువుని అనుసరించి వచ్చే పండుగలు.

                                                 మేం సుంకర మెట్ట సంత నుంచి సిమిలిగూడ వస్తుండగా ఒక గిరిజన మహిళ కళ్ళద్దాలు, టోపీ పెట్టుకుని లూనా చుట్టూ సరకులు అమర్చుకుని ఠీవిగా నిండుగా వెళుతూ కనపడింది. మా తిరుగు ప్రయాణంలో ఆమె తిరుగు ప్రయాణాన్నీ చూసాం ……ఈ సారి సరకులు ఖాళీ ఐన  హుషారులో ఝామ్మంటూ లూనా

 మీద దూసుకుపోయింది.

పతంజలి రాయని కధ

పతంజలి గారు ఓ రోజు ఒక పత్రికాఫీసులో కూర్చొని వుండగా అక్కడికి దండిగా మాత్రమే కధలు రాసిన ఓ విశాఖ రచయిత వచ్చారు. పత్రికాధిపతి ఆయనను పతంజలి గారికి పరిచయం చేసారు. పతంజలి గారు అప్పటికే వీర బొబ్బిలి,రాజుగోరు,దెయ్యం ఆత్మ కధ,పెంపుడు జంతువులులాంటి క్లాసిక్స్ రాసి వున్నారు.ఆ రచయిత పతంజలి గారి వంక దర్పంగా ఓ చూపు చూసి ” ఆ… మీ పేరు విన్నట్లు గుర్తు .మీరు కూడా కధలవీ రాస్తారనుకుంటా” అన్నారు.పతంజలి గారు పెంకిగా “ఎబ్బెబ్బే… నేను అట్లాంటి పనులు చేయను లెండి”అనేసారు.ఈ ఎపిసోడ్ అంతా పతంజలి గారు విశాఖ వర్మకి చెపుతూ ” చూసావోయ్ ఈ రచయితల గోరోజనం…..”అన్నారు.అపుడు వర్మ రణపెంకిగా”అంతేలెండి మరి అయన రాసిన ఐదువందల కధలు మీరు రాయని ఒక కధతో సమానమని”ముక్తాయించారు.

మనసులో ఉన్న సందేహాన్ని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. నేను గర్భవతిని అని,

పితృత్వం

         గత పదిహేను రోజులుగా నా మనసులో ఉన్న సందేహాన్ని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. నేను గర్భవతిని అని, రెండో నెల నిండుతోదని. ఆ వార్త వినగానే నా భర్త మొహం వెలిగిపోయింది. అతని ఆనందం చూసి నాకూ కాసింత గర్వంగా అన్పించింది. నేనో అధ్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాను కదాని.  అప్పట్నించీ నా భర్త చంద్రశేఖర్ నన్ను మరింత అపురూపంగా చూడసాగాడు. దాంతో నేనో ప్రత్యేకమైన వ్యక్తిని అన్న భావం బలపడుతుండేది.

నేను రాసిన ఈ కధ 2005 ఫెబ్రవరిలో వార్త సండే బుక్ లో వచ్చింది.
పూర్తిగా చదవటానికి పితృత్వం లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి.                         
 
 

« పాత టపాలు